‘ప్రభుత్వ చీఫ్విప్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి చెందిన అనంతపురం కళాశాలలో నా తమ్ముడు రామచంద్రుడు ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివాడు. చదువు పూర్తయింది. సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ’ నల్లమాడ మండలం గోపేపల్లి దళివాడకు చెందిన నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. తనకొచ్చిన సమస్యను ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన కలుసుకొని మొరపెట్టుకున్నారు. తన తమ్ముడ్ని మేనేజ్మెంట్ కోటా కింద చేర్చుకొని, ల్యాబ్కు రూ.8 వేలు కడితే చాలని చెప్పారని వివరించాడు.
ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదంటూ రూ.70 వేలు కట్టాలంటూ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక టీడీపీ నాయకుడి ఇంట్లో జీతానికి కుదిరినట్లు కన్నీటిపర్యంతమయ్యారు. సర్టిఫికెట్లు లేకపోవడంతో ఉద్యోగావకాశాలు కోల్పోతున్నట్లు వాపోయారు.