పశ్చిమగోదావరి ,గణపవరం: ఉంగుటూరు నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ముగించుకుని మరో నియోజకవర్గంలోకి వెళ్తున్న సందర్భంగా ఓ వీరాభిమాని ఆయనకు చిరుకానుక అందించారు. బువ్వనపల్లికి చెందిన మందుగుండు సామగ్రి తయారీదారుడు ఏడిద చిన్నా అనే యువకుడు గురువారం ఉదయం జగన్మోహన్రెడ్డి ఫొటోతో అందంగా తీర్చిదిద్దిన మెమెంటోను ఆయనకు బహుమతిగా అందజేశారు. తాను జగనన్న వీరాభిమానినని, ప్రజాసంకల్పయాత్ర 170 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ చిరుకానుక అందజేసినట్టు యువకుడు చెప్పాడు. జగనన్న తనను అభినందించినట్టు తెలిపాడు.
వృషభానికి జగనన్న వందనం
ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఉండి మండలం కోలమూరు గ్రామం చేరుకున్న వైఎస్సార్ సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వృషభానికి నమస్కరించి రైతన్నను అభినందించారు. కోలమూరు గ్రామానికి చెందిన కూనపరాజు రంగరాజు ఒంగోలు కపిల వృషభాన్ని ప్రత్యేక శ్రద్ధతో మేపుతున్నారు. పాదయాత్రలో జగనన్నకు చూపించడానికి ఆ వృషభాన్ని తీసుకురావడంతో ఆయన రెండు చేతులు జోడించి వృషభానికి నమస్కరించారు. అనంతరం ప్రత్యేక శ్రద్ధతో పశువులను సాకాలని రైతన్నలకు సూచించారు.