‘డ్వాక్రా మహిళలకు ఎప్పుడూ తోడుంటాం’

5 Nov, 2019 17:41 IST|Sakshi

సాక్షి, కృష్ణా : పసుపు-కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. జిల్లాలోని పామర్రులో వైఎస్సార్ క్రాంతి పథకం కింద మెగా డ్వాక్రా రుణమేళాను సమాచారశాఖ మంత్రి పేర్ని నాని, స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌తో కలిసి పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 2304 గ్రూపుల్లోని 24,843 మంది డ్వాక్రా మహిళలకు రూ.105 కోట్ల 48 లక్షల చెక్కులను అందజేశారు.
 
మహిళలకు తోడుంటాం..
గత ప్రభుత్వంలో రుణాలు రాక డ్వాక్రా మహిళలు ఎన్నో అవస్థలు పడ్డారని పేర్ని నాని విమర్శించారు. ఇప్పుడు వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి అండగా ఉంటారని పేర్కొన్నారు. అలాగే ఉచితంగా ఇళ్ళ స్థలాలు పంపిణీ చేస్తున్నామని.. ఉగాది వరకు అర్హులందరికీ పట్టాలు అందజేస్తామని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని. ఆయన అడుగుజాడల్లో తాము కూడా నడుస్తామని ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. డ్వాక్రా మహిళలకు తాము ఎప్పుడూ తోడుంటామని పేర్కొన్నారు. జనవరిలో రాబోతున్న అమ్మఒడి పథకం ద్వారా పిల్లలను బడులకు పంపే తల్లులకు 15వేలు అందచేస్తున్నామని తెలిపారు. 

మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. మహిళలను మోసం చేస్తే ఏ గతి పడతుందో 2019 ఎన్నికల్లో తెలిందని గుర్తు చేశారు. ఎన్నికల వేళ పసుపు కుంకుమ అని చెప్పి మహిళలకు డబ్బులు ఎర చూపిన అంతర్జాతీయ మోసగాడు,అంతర్జాతీయ వెన్నుపోటు దారుడు చంద్రబాబుకు మహిళలంతా తగిన గుణపాఠం చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు