వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్కు అక్రమంగా తరలించిన పోలీసులు
పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్లు అడ్డుకోవడమే కారణం!
సాక్షి, టెక్కలి (శ్రీకాకుళం): సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో గురువారం జరిగిన పోలింగ్ ప్రక్రియలో అధికార పార్టీ కార్యకర్తలు చేసే రిగ్గింగ్లను ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారనే నెపంతో నియోజకవర్గంలో పలు మండలాల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలను బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలించారు. టెక్కలిలో పోలింగ్ బూత్ నంబరు 111 పరిధిలో పీత రమణ, పీత రాము లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కోటబొమ్మాళి మండలం తిలారు, కొత్తపల్లి, హరిశ్చంద్రాపురం, కన్నేవలస తదితర గ్రామాల్లో సుమారు ఆరుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను కోటబొమ్మాళి పోలీస్స్టేషన్లో నిర్బందించారు.
టెక్కలి ఆదిఆంధ్రావీధి టీడీపీ కార్యకర్తలు చేస్తున్న ప్రచారాలను అడ్డుకునే ప్రయత్నాలు చేసిన చింతాడ గణపతిని అరెస్టు చేసే ప్రయత్నాలు చేయడంతో, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సింగుపురం మోహనరావు, స్థానిక కార్యకర్తలంతా ఎదురు తిరిగారు. దీంతో స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అలాగే స్థానిక మెయిన్స్కూల్, బజారు స్కూల్ తదితర ప్రాంతాల్లో చిన్నపాటి ఘర్షణలు జరిగాయి. అయితే ఒకవైపు ఎన్నికలు జరుగుతున్న సమయంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసులు కక్ష సాధింపు చర్యలు చేయడంలో మంత్రి అచ్చెన్నాయుడు, కార్యకర్తల ప్రమేయం ఉందంటూ విమర్శలు వెల్లువెత్తాయి.