అమ్మో.. కేన్సర్‌ భూతం!

10 Jul, 2019 10:47 IST|Sakshi

ప్రాథమిక దశలో గుర్తిస్తే వ్యాధి నయం

స్క్రీనింగ్‌ పరీక్షతో వ్యాధి నిర్ధారణ

చక్కటి జీవన శైలితోనే వ్యాధి దూరం

ప్లాస్టిక్, పొగాకు వినియోగంతో ముప్పే

మానవ జీవనంపై కేన్సర్‌ భూతం పంచా విసురుతోంది. కొందరు పొగాకు, మద్యం వంటి వాటికి బానిసలై వ్యాధులు కొని తెచ్చుకుంటే.. తెలిసోతెలియక, వాతావరణ కాలుష్యం కారణంగా మరికొందరు కేన్సర్‌ బారిన పడుతున్నారు. శరీరంలో కేన్సర్‌ ఉందా లేదా..? అన్నది స్క్రీనింగ్‌ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో కేన్సర్‌ ఉన్న విషయాన్ని ప్రాథమిక దశలో గుర్తిస్తే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని సూచిస్తున్నారు. ప్లాస్టిక్‌ వాడకం వల్లే అధికంగా కేన్సర్‌కు దారితీస్తోందని పలువురు హెచ్చరిస్తున్నారు. 8 ప్రాథమిక దశలో గుర్తిస్తే వ్యాధి నయం 8 స్క్రీనింగ్‌ పరీక్షతో వ్యాధి నిర్ధారణ 8 చక్కటి జీవన శైలితోనే వ్యాధి దూరం 8 ప్లాస్టిక్, పొగాకు వినియోగంతో ముప్పే .

ఒత్తిడితో ప్రమాదమే:
మానసిక ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల శరీరంలో రోగనిధోక శక్తిపై తీవ్ర ప్రభావం చూపి కొన్ని రకాల హర్మోన్లు లోపిస్తాయి. క్యాన్సర్‌ రావడానికి కారణమవుతాయి. మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే సంగీతం వినడం, మొక్కలు పెంచడం వంటివి కూడా మానసిక ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. వీటి ద్వారా మానసిక ఒత్తిడి దూరం చేసుకొచ్చు.

తొలిదశలో గుర్తిస్తేనే..
కేన్సర్‌పట్ల అవగాహనతోనే వ్యాధి దూరం అవుతుంది. క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే చిన్నపాటి వైద్యంతో నివారించవచ్చు. అలాకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలకే ప్రమాదం. కేన్సర్‌ దశను బట్టి వైద్యం అందుబాటులో ఉంది. మహిళలు ముఖ్యంగా కేన్సర్‌ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఒత్తిడి లేకుండా జీవనం సాగించడం అన్నిటికన్నా ఉత్తమం.
–  డాక్టర్‌ బి.వి.సుబ్రమణ్యన్, కేన్సర్‌ విభాగం, స్విమ్స్, తిరుపతి 

సాక్షి, తిరుపతి (అలిపిరి): దేశంలో ఏటా కేన్సర్‌ కేసుల సంఖ్య పేరుగుతోంది. వ్యాధి తీవ్రతను తొలిదశలో గుర్తించి వైద్యుల సలహామేరకు వ్యాధి నివారణ చికిత్స పద్ధతులు అలవలంభించడం వల్ల కేన్సర్‌ నుంచి పూర్తిగా కోలుకోవచ్చు. ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరి జీవన శైలి మారుతోంది. పోగాకు వినియోగం, మద్యం సేవించడం,  ప్లాస్టిక్‌ వినియోగం.. ఇలా ఒక్కటేమిటి పలు కారణాలతో క్యాన్సర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏటా కేన్సర్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది.  

ప్రాథమిక దశలో గుర్తించాలి 
కేన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తించినప్పుడే వ్యాధిని నివారించడం సాధ్యమవుతుంది. క్యాన్సర్‌ ముదిరిన తర్వాత చికిత్స చేసుకుంటే కోలుకునే అవకాశం తక్కువ. మానవ అజాగ్రత్త వల్లే కేన్సర్‌ మరణాలు అధికమయ్యాయని వైద్యలు అంటున్నారు. వ్యాధి రాకుండా నివారించడం.. ఒక వేళ వచ్చాక తొలిదశలో గుర్తిస్తేనే మరణాల రేటును తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కేన్సర్‌ ఉందా.. లేదా అన్నదని స్క్రీనింగ్‌ టెస్ట్‌ ద్వారా తెలుసుకోవచ్చని  చెబుతున్నారు. గ్రామీణ ప్రాంత మహిళలు తరచూ స్క్రీనింగ్‌ టెస్ట్‌లు చేసుకోవడం ఉత్తమం. 

జాగ్రత్తలు అనివార్యం
ఉభకాయ బాధితులు, మద్యపానం, ధూమపానంచేసేవారు, రసాయన ప్యాక్టరీల్లో పనిచేసేవారు కేన్సర్‌ బారినపడే ప్రమాదం ఎక్కువ. అధిక బరువుతో బాధపడేవారిలో పేగు, క్లోమ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కవ. మద్యపానం చేసేవారికి నోటి, గోంతు కేన్సర్లు వచ్చే ముప్పు ఉంది. ధూమపానం చేసేవారికి నోటి, గొంతు కేన్సర్లు తోపాటు ఊపిరితిత్తుల కేన్సర్, మరిన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం లేకపోలేదు. రసాయన ఫ్యాక్టరీల్లో పనిచేసే వారికి ప్రధానంగా మూత్రాశయ కేన్సర్‌ ఇతర కేన్సర్లు వచ్చే అవకాశం ఉంది. 

నగరవాసులూ.. జాగ్రత్త
నగరాల్లో ఎక్కవగా మహిళలు రొమ్ము, గర్భసంచి ముఖద్వారం, ఊపిరితిత్తుల క్యాన్సర్లకు గురవుతున్నారు. కేన్సర్‌కు గురైన మహిళలు సరైన పద్ధతుల్లో వైద్యం తీసుకుంటే సుఖవంత జీవనం కొనసాగించవచ్చు. మహిళలు ముఖ్యంగా కేన్సర్‌పై ఉన్న భయాలను వీడాలి. అప్పుడే కేన్సర్‌ను నివారించడం సాధ్యమవుతుంది. పురుషుల్లో ఊపిరితిత్తుల కేన్సర్, పొట్టలో వచ్చే క్యాన్సర్లు ఎక్కవ. వయస్సుల వారీగా కూడా కొన్ని రకాల క్యాన్సర్లు వస్తుంటాయి. అవగాహనతోనే కేన్సర్‌ను జయించవచ్చు.

కేన్సర్‌ను అడ్డుకోవచ్చిలా..
కేన్సర్‌ను దరిచేరకుండా ఉండాలంటే చక్కటి జీవన శైలిని అలవరచుకోవడం ప్రధానం. క్యాన్సర్‌ నిరోధించే ఆహార ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ప్రాణాంతకమైన ఈ వ్యాధిని అడ్డుకొవచ్చని వైద్యులు చెబుతున్నారు. శుభ్రంగా ఉప్పు నీళ్లతో బాగాకడిగిన తర్వాతనే కూరగాయలు, పండ్లను వినియోగించాలి. రసాయనాలు కలిపిన ఆహారపదార్థాలను వీలైంత దూరంగా ఉంచాలి. శరీరానికి అవసరమైన విటమిన్‌– డీ అధికంగా సూర్యరశ్మి నుంచి వస్తుంది. వీటమిన్‌ – డీ లోపం వల్ల శరీరంలోని కణజాలం మధ్య సంకేతాలు సన్నగిల్లుతాయి. ఫలితంగా కేన్సర్‌ కారక కణాలు విజృంభిస్తాయి. రోజుకు 15 నిమిషాలు ఎండలో గడపడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్‌లు అందుతాయి. పడకగదిలో నిరంతరం లైట్లు వేసి ఉంచడం వల్ల మహిళలకు వక్షోజ, గర్భాయ కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కవ. పడక గతిలో సాధ్యమైనంత వరకు వెలుతురు తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 

కేన్సర్‌– చికిత్సా విధానం
భారతదేశంలో మెడ, గొంతు కేన్సర్ల బారిన 45 శాతం, గర్భాశయ కేన్సర్‌ బారిన 35 శాతం మంది పడుతున్నారు. పాపిలోమా వైరస్‌ వల్ల గర్భాశయ క్యాన్సర్‌ను కలుగజేస్తుంది. కేన్సర్‌ నివారణకు వైద్యరంగంలో మూడు పద్ధతుల్లో వైద్యాన్ని అందిస్తున్నారు. సర్జరీ, కీమోథెరపీ, రేడియో థెరపీ విధానాలు అందుబాటులో ఉన్నాయి.  

మరిన్ని వార్తలు