సాక్షి, అమరావతి : ఈఎస్ఐ మందుల స్కామ్లో డొంక కదులుతోంది. గతేడాది టీడీపీ నేతలతో కుమ్మక్కైన సరఫరా కంపెనీల సిండికేట్ అధిక ధరలకు మందులు, కిట్లను సరఫరా చేసిన వైనం గురించి అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చంద్రబాబు హయాంలో ఒకే వ్యక్తి 42 కంపెనీల పేర్లతో మందులు, పరికరాల సరఫరా చేసే విషయమై ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో ఈఎస్ఐ ఆస్పత్రులకు మందులు చేరకుండానే బిల్లులు పెట్టిన వైనం వెలుగుచూసింది. అంతేగాకుండా తెలంగాణలో బ్లాక్లిస్ట్లో పెట్టిన కంపెనీలకు ఏపీలో సరఫరా బాధ్యతలు అప్పగించారు.
అదే విధంగా తెలంగాణలో స్కామ్ చేసిన సంస్థలకే ఏపీలో పెద్ద పీట వేశారు. తమ నేరం బయటపడుతుందనే భయంతో విచారణ అధికారులను సైతం ప్రలోభపెట్టేందుకు సిండికేట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబు హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల రూ. 300 కోట్ల మేర గోల్మాల్ జరిగినట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. దీంతో ఈ స్కాంపై మంత్రి జయరాములు విచారణకు ఆదేశించిన క్రమంలో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.