సీపీఎస్‌ రద్దు చేయకుంటే రాష్ట్ర వ్యాప్త నిరసనలు

27 Mar, 2018 12:12 IST|Sakshi
నిరాహారదీక్ష శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న సాయిరాం

 48 గంటలు నిరాహారదీక్ష చేయడంఅమోఘం

ఏపీ ఎన్‌జీవో సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి

నిమ్మరసం ఇచ్చి దీక్షల విరమింపజేసిన ప్రతినిధులు

శ్రీకాకుళం అర్బన్‌: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం విధానం రద్దు కోసం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానించి ఆమోదించాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతాయని ఏపీ ఎన్‌జీవో సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషొత్తమనాయుడు, పెన్షన్‌ సాధన సమితి జిల్లా కన్వీనర్‌ హనుమంతు సాయిరాం హెచ్చరించారు. ఈ మేరకు నగరంలోని ఎన్‌జీవో కార్యాలయం వద్ద రెండో రోజు సోమవారం నిరాహారదీక్షా శిబిరాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. ఇక్కడ 109 మంది ఉద్యోగులు 48 గంటలపాటు నిరాహారదీక్ష చేయ డం సాధారణ విషయం కాదన్నారు. ఈ పోరాటాలను ప్రభుత్వం చూసి సీపీఎస్‌ రద్ద కోసం కృషిచేయాలన్నారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు.

లేనిపక్షంలో తలెత్తే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు యూ తారకేశ్వరరావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గురుగుబెల్లి భాస్కరరావు, సీహెచ్‌ దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ సీపీఎస్‌ బాధితులు చేస్తున్న దీక్ష రాష్ట్రంలోని లక్షా 86 వేల మంది ఉద్యోగుల ఆక్రందన అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చనిపోయిన 286 మంది బాధిత కుటు ంబాల దీనస్థితులు ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. ఉద్యోగుల దక్షతను, నిబద్ధతను చులకనగా చూస్తే ఉద్యమాంధ్రప్రదేశ్‌గా మారుతుందని హెచ్చరించారు. అతిచి న్నం రాష్ట్రం త్రిపురలో ఇప్పటికీ పాతపింఛన్‌ విధానం కొనసాగుతోందన్నారు. మన రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. లేనిపక్షంలో 2004 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు పునరావృతం కాక తప్పదన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే అసెంబ్లీ ముందే ఆమరణ నిరాహారదీక్షలకు వెనుకాడబోమని హెచ్చరించారు.  రెండ్రోజుల నిరాహారదీక్షకు సంఘీభావం ప్రకటించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

దీక్ష విరమణ
సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ రెండ్రోజుల నిరాహారదీక్ష చేసిన ఉద్యోగులకు ఏపీ ఎన్‌జీవో సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు పురుషొత్తమనాయుడు, పెన్షన్‌ సాధన సమితి జిల్లా కన్వీనర్‌ హనుమంతు సాయిరాం నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో జాక్టో చైర్మన్‌ పప్పల రాజశేఖర్, యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి చౌదరి రవీంద్ర, ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పేడాడ ప్రభాకరరావు, డీటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి జీ గోపాలరావు, పీ హరిప్రసన్న, ఏపీటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి కొప్పల భానుమూర్తి, గురుగుబెల్లి బాలాజీరావు(ఏపీటీఎఫ్‌), కే పద్మావతి(ఆర్‌యూపీపీ), రవీంద్ర(ఐసీడీఎస్‌), చంద్రరావు (బీసీ వెల్ఫేర్‌), బొడ్డేపల్లి మోహనరావు, వివిధ సంఘాల నాయకులు బైరి అప్పారావు, వీ హరిశ్చంద్రుడు, శ్రీనివాసరావు, మల్లేశ్వరరావు, రామారావు, ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘ ప్రతినిధులు పీ మురళి, ఎన్‌ రత్నకుమార్, ఎస్‌ గోపి, ఎం శ్రీనివాసరావు, బీ పూర్ణచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు