సమస్యాత్మక గ్రామాల్లో ఆర్‌ఏఎఫ్ బృందం సర్వే

12 Nov, 2014 02:28 IST|Sakshi

ఒంగోలు క్రైం : జిల్లాలో సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక, సామాజిక, మత సంబంధ గ్రామాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) బృందం సర్వే ప్రారంభించింది. సికింద్రాబాద్- 99 ఆర్‌ఏఎఫ్ బెటాలియన్‌కు చెందిన డిప్యూటీ కమాండెంట్ హెచ్‌పీ సింగ్ నేతృత్వంలోని 70 మందితో కూడిన బృందం జిల్లాలో పర్యటించేందుకు మంగళవారం ఒంగోలు చేరుకుంది.

అసిస్టెంట్ కమాండెంట్ కె.పాపారావుతో పాటు ఆర్‌ఏఎఫ్ బృందం ఒంగోలు డీఎస్పీ పి.జాషువాను ఆయన కార్యాలయంలో కలిసింది. ఒంగోలు పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంది. సింగరాయకొండ, కొత్తపట్నం, మర్రిపూడి, జరుగుమల్లి, సంతనూతలపాడు, చీమకుర్తి, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాలతో పాటు ఒంగోలు నగరంలోని ప్రాంతాలకు సంబంధించిన వివరాలను డీఎస్పీ నుంచి సేకరించింది.

 సామాజిక ఘర్షణలు జరుగుతున్న గ్రామాలను సైతం పరిగణనలోకి తీసుకొని వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసేందుకు సర్వే దోహదపడుతుందని డిప్యూటీ కమాండెంట్ హెచ్‌పీ సింగ్ వివరించారు. 70 మంది ప్రత్యేక పోలీసులు వారం పాటు జిల్లా మొత్తం పర్యటించి సర్వే చేయనున్నట్లు పేర్కొన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు వాటి పరిసరాలపై కూడా పూర్తి స్థాయి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి అందించనున్నట్లు సింగ్ చెప్పారు.

మరిన్ని వార్తలు