రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు, తెలంగాణ - సీమాంధ్ర కాంగ్రెస్ నేతల మధ్య పోటాపోటీ వాతావరణం మధ్య.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ కేంద్రంగా ఆసక్తికరమైన ప్రణాళికా రచన సాగుతోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాహుల్ను తెలంగాణ ప్రాంతం నుంచి బరిలోకి దించాలన్న ఆలోచనకు కాంగ్రెస్ తెలంగాణ నేతల్లోని ఒక వర్గం పదునుపెడుతోంది.
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు రాహుల్గాంధీని ఒప్పించాలంటూ ఇప్పటికే ఆ జిల్లా డీసీసీ బృందం రాహుల్ సలహాదారులను కలిసి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. రాహుల్ను తెలంగాణ నుంచి పోటీచేయించటం ద్వారా.. రాజకీయాలను పూర్తిగా కాంగ్రెస్కు అనుకూలంగా మలచుకోవచ్చని ఆ నాయకులు అంచనా వేస్తున్నట్లు చెప్తున్నారు.
దీనివల్ల టీఆర్ఎస్ నాయకులపై ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రభావం తగ్గుతుందని.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు కాంగ్రెస్ వైపు వచ్చేందుకు దోహదం చేస్తుందని.. కేసీఆర్కు బేరమాడే శక్తి తగ్గి.. కాంగ్రెస్కు పైచేయి లభిస్తుందని.. టీఆర్ఎస్తో సంప్రదింపుల్లో పార్టీని నిర్ణయాత్మక స్థానంలో నిలుపుతుందని వారు భావిస్తున్నట్లు సమాచారం.
దామోదరకు ఢిల్లీ పిలుపు...
బుధవారం సోనియాగాంధీతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ దిగ్విజయ్సింగ్ భేటీలో.. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులతో పాటు.. తెలంగాణ నుంచి రాహుల్ను పోటీకి దించే అంశం చర్చకు వచ్చినట్లు చెప్తున్నారు. హైదరాబాద్ హోదా అంశంపై చర్చించేందుకు ఈ నెల 27వ తేదీన ఢిల్లీకి రావాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి రాజనరసింహను కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. ఈ భేటీలో ‘రాయల తెలంగాణ’ ప్రతిపాదన కూడా చర్చకు వచ్చే అవకాశముందని చెప్తున్నారు. పాలమూరు బరిలో రాహుల్ గాంధీ!