నేడు ‘ఆర్‌సీఐ’ రజతోత్సవాలు

26 Aug, 2013 02:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: దేశానికే గర్వకారణమైన రక్షణ పరిశోధన సంస్థ రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్‌సీఐ) రజతోత్సవాలకు సిద్ధమవుతోంది. దీన్ని పురస్కరించుకుని ఈనెల 26న కాంచన్‌బాగ్‌లోని ఆర్‌సీఐ ప్రధాన కేంద్రంలో జరిగే వేడుకలకు గవర్నర్ నరసింహన్‌తోపాటు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, రక్షణశాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ హాజరుకానున్నారు. 1984లో కలాం ఆలోచనల మేరకు ఈ కేంద్రం ఏర్పాటుకు అంకురం పడగా, 1985 ఆగస్టు 3న అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ శంఖుస్థాపన చేశారు. 1988 ఆగస్టు 27న అప్పటి రాష్ట్రపతి ఆర్.వెంకటరామన్ జాతికి అంకితమిచ్చారు.
 
 అబ్దుల్ కలాం, లెఫ్టినెంట్ జనరల్ వి.జె.సుందరం, కెవిఎస్‌ఎస్ ప్రసాదరావు, వి.కె.సారస్వత్, ఎస్.కె.రే, అవినాశ్ చందర్, ఎస్.కె.చౌదరీ లాంటి దిగ్గజ శాస్త్రవేత్తల నేతృత్వంలో పలు విజయాలు సాధించిన ఈ సంస్థకు ప్రస్తుతం జి.సతీశ్‌రెడ్డి సంచాలకుడిగా వ్యవహరిస్తున్నారు. అగ్ని, పృథ్వీలతోపాటు దేశీయ క్షిపణులన్నింటికీ అవసరమైన ఏవియానిక్స్ వ్యవస్థల డిజైనింగ్, తయారీ జరిగేది ఈ కేంద్రం లోనే.  హైదరాబాద్‌లోని కాంచన్‌బాగ్‌లో ఉన్న ఆర్‌సీఐ రక్షణ రంగంలో స్వావలంబన సాధిం చేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో కీలకపాత్ర పోషిస్తోంది.

మరిన్ని వార్తలు