శ్రీకాకుళం ,ఎచ్చెర్ల క్యాంపస్: వెనుకబాటుకు గురైన వెలమ సామాజిక వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వెలమ సామాజిక వర్గం ఐక్య కార్యాచరణ ప్రణాళిక రాష్ట్ర ప్రతినిధి తెంటు సత్యనారాయణ కోరారు. ఈ మేరకు రాజమహేంద్రవరం నుంచి వచ్చిన జేఏసీ నాయకులు సోమవారం రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజా సంకల్పయాత్రలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 50 లక్షల మంది వెలమ కులస్తులు ఉన్నారని, వారిలో 95 శాతం వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారని చెప్పారు.
జేఏసీ అధ్యయనంలో వెలమలకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం నామమాత్రంగా ఉందని గుర్తించామన్నారు. కొప్పల, పోలినాటి, ఆది, పద్మనాయక వెలమల సంక్షేమం కోసం రూ.2000 కోట్లు బడ్జెట్తో కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. దివంగత ముఖ్య మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ సామాజిక వర్గానికి ఇచ్చిన ప్రాధాన్యతను ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పారు.