► ఒకే చోట పాతుకుపోతున్న ఆర్ఐలు
► కోర్సు పూర్తయినా సీటు వదలని రెవెన్యూ ఇన్స్పెక్టర్లు
► వారం రోజుల్లో కొత్తగా 23 మందికి ఆర్ఐ పోస్టులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: రెవెన్యూ శాఖలో ఒకే చోట పాతుకుపోయి పనిచేసే సంప్రదాయం ఇంకా కొనసాగుతోంది. వారిని బదిలీ చేయడం, వేరే చోటకు మార్పు చేయడం వంటి వాటిపై యంత్రాంగం దృష్టి సారించడం లేదు. ఎక్కువ మంది ఆర్ఐలు ఒకే చోట ఏళ్ల తరబడి పని చేస్తుండడంతో అవినీతి కూడా పెరిగిపోతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు పలుకుబడి ఉన్న వాళ్లకే పని జరగడం, మిగిలిన వారు ఇబ్బందులు పడడం సాధారణమైపోతోంది. ఆర్ఐలుగా ఒకసారి పదోన్నతి వచ్చాక రెండేళ్లు మాత్రమే ఆ పోస్టులో ఉండాలి. తర్వాత ఇతర పోస్టులకు వెళ్లాలి. కానీ కొందరు ఆర్ఐ సీటు నుంచి కదలకపోవడంతో జూనియర్ అసిస్టెంట్లకు ఆర్ఐ కోర్సు చేసే అవకాశం లేకుండా పోతోంది.
ఆర్ఐ కోర్సు తప్పనిసరి
రెవెన్యూ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగికి ఆర్ఐ కోర్సు తప్పనిసరి. ఆ శాఖలో జూనియర్ అసిస్టెంట్ అంతకంటే తక్కువ క్యాడర్లో విధుల్లోకి చేరితే వారు పదోన్నతులు పొందాలంటే, తహసీల్దార్ అంతకంటే ఉన్నత పోస్టులకు వెళ్లాలన్నా తప్పనిసరిగా ఆర్ఐ కోర్సు చేయాలని ఉంటుంది. ఈ కోర్సులో రెండేళ్లలో ఏడాదిన్నర కాలం ఆర్ఐ గాను, మరో ఆరు నెలలు సివిల్ సప్లై ఆర్ఐ గాను తప్పని సరిగా పనిచేయాలి. ఇలా పని చేయకుంటే పదోన్నతుల సమయంలో ఇబ్బందులు తప్పవు. అయితే ఇటీవల ఈ కోర్సు చేసేందుకు కొత్తవారికి అవకాశం రాకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒకే చోట..
దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేసినవారు జిల్లాలో సుమారుగా 27 మంది ఉన్నారు. వాస్తవానికి జిల్లాలో 38 మండలాలకు 72 మంది ఆర్ఐలు ఉండాలి. అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒకరికి తక్కువ లేకుండా సివిల్ సప్లై ఆర్ఐ ఉంటారు. అయితే వీరిలో రెండేళ్ల కంటే ఎక్కువ సమయం కోర్సులో ఉన్నవారు 27 మంది ఉన్నారు. వీరికి స్థానం చలనం చేస్తే మరింత మంది కొత్తవారికి ఆ ర్ఐ కోర్సులు పూర్తి చేసే అవకాశం వస్తుంది.
► 2011 నుంచి ఆర్ఐలు గా చేస్తున్న వారు జిల్లాలో 11 మంది ఉన్నారు. గార, పొం దూరు, రణస్థలం, ఎల్ఎన్పేట, భామిని, ఆర్.ఆమదాలవలస, టెక్కలి, సంతబొమ్మాళి, పలాస మందసల్లో ఆర్ఐలుగా ఒక్కొక్కరు పనిచేస్తున్నారు. వీరంతా ఆర్ఐలుగా సుమారు ఆరేళ్లుగా ఒకే చోట పని చేసిన వారు కావడం విశేషం.
► 2012 నుంచి ఆమదాలవలలో ఒక ఆర్ఐ పనిచేస్తున్నారు. ఐదేళ్లుగా ఈయన ఒకే చోట పనిచేస్తున్నారు.
∙2013 నుంచి ఐదుగురు ఆర్ఐలు పనిచేస్తున్నారు. వారు నరసన్నపేట, బూర్జ, రా జాం, సోంపేట, వజ్రపుకొత్తూరులో ఉన్నా రు. వీరు నాలుగేళ్లుగా ఒకే చోట పని చేస్తున్నారు.
► 2014 నుంచి ఒకే చోట పని చేస్తున్నవారు ఆరు మంది ఉన్నారు. కవిటిలో ఇద్దరు, సారవకోట, రాజాం, సంతకవిటి, గార, బూర్జ, శ్రీకాకుళం జి.సిగడాం మండలాల్లో ఉన్నారు. వీరు మూడేళ్ల కంటే ఎక్కువ కాలంగా ఆ స్థానంలో ఉన్నారు.
► 2015 నుంచి చేస్తున్నవారు ఒకరు ఉన్నారు. సారవకోట ఆర్ఐగా పనిచేస్తున్నారు.
మరో వారం రోజుల్లో రెవెన్యూ విభాగంలో కొత్తగా మరో 23 మందికి ఆర్ఐలుగా పదోన్నతులు కల్పించేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం సన్నాహాలు చేస్తోం ది. ఇప్పటికే జూనియర్ అసిస్టెంట్లలో సీనియారిటీ జాబితాలను సిద్ధం చేశారు. వారికి మండలాల్లో ఆర్ఐ కోర్సులు చేసేందుకు జాబితాలు తయారు చేస్తున్నారు. ఈ జాబితాలో ఉన్న వారికి మరో వారం రోజుల్లో పోస్టింగ్ ఉత్తర్వులు రానున్నాయి. అయితే దీర్ఘకాలికంగా ఒకే చోట ఉన్నవారిని స్థాన చలనం చేస్తే మరింత మం దికి ఆర్ఐ కోర్సులు చేసేందుకు అవకాశం వస్తుందని జూనియర్లు చెబుతున్నారు.