విమాన ఇంధన పన్నులు సమీక్షించండి

17 Sep, 2014 02:16 IST|Sakshi
విమాన ఇంధన పన్నులు సమీక్షించండి

రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశాం
కేంద్ర మంత్రి  అశోక్ గజపతి రాజు వెల్లడి
ఏరోనాటికల్ సొసైటీ సదస్సు ప్రారంభం
హైదరాబాద్‌ను  అగ్రగామిగా చేస్తాం: కేటీఆర్

 
హైదరాబాద్: విమాన ప్రయాణాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు పలు చర్యలు చేపట్టామని కేంద్ర పౌర, విమానయాన శాఖల మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. ఇందులో భాగంగా విమాన ఇంధనంపై విధిస్తున్న పన్నులను సమీక్షించాల్సిందిగా కోరుతున్నట్లు ఆయన హైదరాబాద్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. విమాన ఇంధనంపై సేల్స్‌ట్యాక్స్ తగ్గించుకోవాలని తమ మంత్రిత్వ శాఖ రాసిన లేఖకు ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్‌లు మాత్రమే స్పం దించాయని తెలిపారు. ఏపీలోని కుప్పం, కడపలలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటయ్యే అవకాశముందని సూచనప్రాయంగా వెల్లడించారు. అంతకుముందు అశోక్‌గజపతి రాజు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ విభా గం ‘స్వదేశీ పరిజ్ఞానంతో పౌర, మిలటరీ విమానాల అభివృద్ధి’ అన్న అంశంపై ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం గర్విం చదగ్గ నగరాల్లో హైదరాబాద్ ఒకటని, వైమానిక రంగంలోనూ ఈ నగరానికి మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ‘డిజిటల్ ఇండియా’ను ఆవిష్కరణకు ప్రయత్నాలు చేస్తూండగా, తెలంగాణ అంతకం టే వేగంగా గ్రామాలన్నింటినీ టెక్నాలజీ ఆధారంగా అనుసంధానించేందుకు కృషి చేస్తోందని కొనియాడారు. తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ మంత్రి కె.తారక రామారావు ఈ దిశగా చొరవ చూపడం హర్షణీయమని ప్రశంసించారు.

మరో రెండు ఏరోపార్క్‌లు: కేటీఆర్

ఐటీ, ఫార్మా రంగాల్లో ఇప్పటికే దేశంలోనే తనదైన ముద్ర వేసుకున్న హైదరాబాద్ నగరం వైమానిక రంగంలోనే అగ్రస్థానానికి చేరుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుం దని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న జీఎంఆర్ ఏరోపార్క్‌కు అదనంగా ఇలాంటివాటిని మరో రెండింటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినీడు ప్రాంతంలో ఒక ఏరోపార్క్ కోసం వెయ్యి ఎకరాల స్థలాన్ని కేటాయించామని వివరించా రు. నగరానికి ఉత్తరంగా మరో వెయ్యి ఎకరాల్లో ఇంకో ఏరోపార్క్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండి యా ఛైర్మన్ డాక్టర్ వి.కె.సారస్వత్, అధ్యక్షులు, జీఎంఆర్ గ్రూపు సంస్థల ఛైర్మన్ జీ.ఎం.రావు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చైర్మన్ ఆర్.కె.త్యాగి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు