రౌడీ షీటర్‌ దారుణ హత్య

17 Jun, 2018 11:31 IST|Sakshi

వెంకటేశ్వరపురం బార్‌ ఎదుట పట్టపగలే ఘటన 

పక్కా స్కెచ్‌తోనే ఘాతుకం

ప్రత్యక్షంగా పాల్పడింది ఇద్దరు 

పరోక్షంగా మరో నలుగురి ప్రమేయం 

నెల్లూరు(క్రైమ్‌),(వీఆర్సీసెంటర్‌): అందరూ సంతోషంగా రంజా న్‌ పండగను జరుపుకుంటున్న వేళ ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం సెంటర్‌ వద్ద ఉన్న సప్తగిరి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ సమీపంలో శనివారం సాయంత్రం ఓ రౌడీ షీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నగరంలోని ఉడ్‌హౌస్‌పేట ప్రాంతానికి చెందిన బస్టాండ్‌ సాయి(30) అనే రౌడీషీటర్‌పై పలు హత్యలు, దొంగతనాలు, బెదిరింపులకు సంబంధిం చి రూరల్, 2వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదై ఉన్నాయి.

 ఈ క్రమంలో ఇటీవలే ఓ కేసులో రిమాండ్‌లో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చాడు. గతేడాది ఫిబ్రవరి 20వ తేదీ ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద బుజబుజనెల్లూ రుకు చెందిన కృష్ణయ్యను నగదు కోసం బండరాయితో కొట్టి హత్యచేసిన కేసులో కూడా సాయి ప్రధాన నిందితుడు. అయితే నెల్లూరు çనగరంలోని 54వ డివిజన్‌ జనార్దన్‌రెడ్డి కాలనీలో గత కొంతకాలంగా సాయి ఓ మహిళతో సన్నితంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో శనివారం ఆ మహిళతో గొడవ పడి దాడి చేశాడు. ఆ మహిళ నవాబుపేట పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ వి.వి.రమణయ్య వద్దకు వచ్చి సాయి తనపై దాడి చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. 

దీంతో సాయిని ఎస్‌ఐ మందలించి పంపేశారు. అక్కడ నుంచి సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో వెంకటేశ్వరపురం సెంటర్‌కు వచ్చిన సాయి బార్‌లో మద్యం సేవించి బయటకు రావటాన్ని గమనించిన గణేష్, అమర్‌ అనే ఇద్దరు యువకులు పక్కాస్కెచ్‌తో తమ వెంట తెచ్చుకున్న కత్తి, బీర్‌ బాటిళ్లతో సాయిను అతి కిరాతకంగా అందరూ చూస్తుండగానే దాడి చేశారు. దీంతో సాయి అక్కడిక్కడే మృతిచెందాడు. సాయి మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాతే నిందితులు తమ నలు గురు అనుచరులకు చెందిన రెండు బైక్‌లపై వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న నవాబుపేట పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐలు శ్రీహరిబాబు, వి.వి.రమణయ్య, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పాత కక్షలతోనే హత్య 
బస్టాండ్‌ సాయి హత్య పాతకక్షల నేపథ్యంలోనే జరిగినట్లు తెలుస్తోంది. సాయి, హత్యకు పాల్పడిన గణేష్‌లు స్నేహితు లు. గతంలో ఇద్దరూ కలిసి పలు నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సాయి ఇటీవల బెయిల్‌పై జైలు నుంచి రావడంతో హత్యకు పక్కా ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది. సాయిపై దుండగులు దాడి చేస్తున్న సమయంలో కొందరు స్థానికులు తమ సెల్‌ఫోన్‌లలో హత్యకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించారు. ఈ వీడియోల్లో హత్య చేసిన వారు గణేష్, అమర్‌లుగా గుర్తించగా, హత్య చేసి 2 బైక్‌లపై మరో నలుగురితో కలిసి వీరు వెళ్లడం చూస్తుంటే ముందస్తు ప్రణాళికతోనే ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు