లాడ్జిలో యువకుడి దారుణ హత్య

31 Oct, 2023 08:55 IST|Sakshi

హైదరాబాద్: లాడ్జిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేపీహెచ్‌బీ ధర్మారెడ్డి కాలనీలో ఎస్‌ఎస్‌ రెసిడెన్సీ లాడ్జిలో ఆదివారం ఉదయం బళ్లారికి చెందిన నవీన్‌ (26), ఏలూరుకు చెందిన ప్రవీణ్‌ రెండో ఫ్లోర్‌లోని 211 గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ రూమ్‌లో ఏసీ సరిగ్గా రాకపోవటంతో వారు మూడో ఫ్లోర్‌లోని 303కు మారారు. ఇద్దరు కలిసి రాత్రి మద్యం తాగారు. మద్యం మత్తులో వారి మధ్య ఘర్షణ జరగడంతో ప్రవీన్‌ నవీన్‌ను కత్తితో మెడపై పొడవటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

సోమవారం ఉదయం గది ఖాళీ చేయాలని చెప్పేందుకు వచ్చిన లాడ్జి సిబ్బంది తలుపు తట్టగా నవీన్‌ బెడ్‌పై రక్తపు మడుగులో కనిపించాడు. దీంతో వారు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌ టీంతో కలిసి ఆధారాలను సేకరించారు.

నవీన్‌ మృతదేహం పక్కన పడి ఉన్న మద్యం బాటిళ్లు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుడు ప్రవీణ్‌ కోసం గాలింపు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు