గిరిజనుల సంక్షేమానికి రూ.18.75 కోట్లు

29 Sep, 2013 02:28 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులు పూర్తిగా వారికే అందేలా సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తున్నామని, అందులో భాగంగా జిల్లాకు 12 ఎస్టీ వసతిగృహాలను ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. శనివారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో విలేకరులతో మంత్రి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ఎస్టీల అభివృద్ధికిగాను రూ.18.75 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు.
 
 ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, పరిగి, సరూర్‌నగర్, బాలానగర్, రాజేంద్రనగర్, మేడ్చల్‌లో బాలుర హాస్టళ్లు... కుత్బుల్లాపూర్, ఘట్‌కేసర్ గిరిజనుల సంక్షేమానికి రూ.18.75 కోట్లు (బాలురు/బాలికలు) వసతిగృహాలను రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే కుల్కచర్ల మండలంలోని బండివెల్కచర్ల, రాంపూర్‌లో ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుల క్వార్టర్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.60 లక్షలు విడుదల చేసిందన్నారు. మహ్మదాబాద్, తాండూరు, కుల్కచర్లలోని హాస్టళ్లను బాలికల ఆశ్రమ పాఠశాలలుగా స్థాయి పెంచాలని నిర్ణయించినట్లు, ఈ మూడింటికి రూ.3 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
 
  పరిగి నియోజకవర్గ కేంద్రంలో సహాయ గిరిజన సంక్షేమాధికారి కార్యాలయం/గోడౌన్ నిర్మాణానికి రూ.15 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందని ప్రసాద్ తెలిపా రు. రాజేంద్రనగర్‌లో యువత శిక్షణ కేంద్రాన్ని నిర్మిం చేందుకు రూ.3 కోట్లు విడుదల చేసిందని పేర్కొన్నారు.
 
 రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం
 కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకోని అగ్గనూర్ - బషీరాబాద్ మార్గానికి ఆర్‌అండ్‌బీ శాఖ రూ.14 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు. అలాగే తాండూరు - కోట్‌పల్లి, కోట్‌పల్లి - సదాశివపేట్, వికారాబాద్ - సదాశివపేట్, శంకర్‌పల్లి - మోమిన్‌పేట్ రహదారుల అభివృద్ధికి రూ.52 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ప్రస్తుతం సీఎం పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదనలకు త్వరలోనే ఆమోదముద్ర పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
 ఎంసీహెచ్ పరిధిలోనే కేంద్ర పాలన
 కేంద్రం పర్యవేక్షణలో పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని ప్రసాద్ తెలిపారు. ఈ పాలనను పాత ఎంసీహెచ్ పరిధికే పరిమితం చేయాలని కేంద్రానికి నివేదించామన్నారు. కేవలం శాంతిభద్రతలను మాత్రమే కేంద్ర సర్కారు పర్యవేక్షించనుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తానేమీ స్పందించనని, ఆయన సమైక్యరాష్ట్రానికి సీఎం అని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

మరిన్ని వార్తలు