ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

27 Sep, 2014 00:31 IST|Sakshi
ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

వ్యవసాయశాఖ రాష్ట్ర కమిషనర్ మధుసూదనరావు
 
 కొరిటెపాడు (గుంటూరు)
 ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అధిక ధరలకు విక్రయిస్తే ఆ ప్రాంత వ్యవసాయ అధికారి బాధ్యత వహించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ కె.మధుసూదనరావు హెచ్చరించారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జిల్లా వ్యవసాయ అధికారులతో జిల్లాలో ఏఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు, సీజనల్ కండీషన్, ఎరువుల పొజిషన్, పొలం పిలుస్తోంది కార్యక్రమంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎరువులు అధిక ధరలకు విక్రయించే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయటంతోపాటు లెసైన్సులను రద్దు చేయాలని ఆదేశించారు. జిల్లా లో ఎరువుల కొరత లేకుండా చూడాలని సూచించారు. వినుకొండ,మాచర్ల, సత్తెనపల్లి,నరసరావుపేట ప్రాంతాల్లో ప్రైవేటు డీలర్లు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని, వారిపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు వి.శ్రీధర్, డీడీఏలు పద్మావతి, జ్ఞానేశ్వరరావు, జిల్లాలోని ఏడీఏలు, ఏవోలు పాల్గొన్నారు.
 కమిషనర్‌ను కలిసిన ఎరువుల వ్యాపారులు
 ఎరువుల వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కమిషనర్ కె.మధుసూధనరావుకు ది గుంటూరు జిల్లా ఎరువులు, ఫెస్టిసైడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం ఐబీలో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు వీవీ నాగిరెడ్డి మాట్లాడుతూ గతంలో జిల్లాకు వచ్చే ఎరువుల్లో ప్రైవేటు డీలర్లకు 70 శాతం, మార్క్‌ఫెడ్ 30 శాతం కేటాయించే వారని, ప్రస్తుతం అదే నిష్పత్తిలో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఎరువులు, పురుగుమందులపై వ్యాట్ లేకుండా జీవో జారీ చేయాలని కోరారు. కమిషనర్‌ను కలిసిన వారిలో అసోసియేషన్ సెక్రటరీ కె.వెంకటేశ్వర్లు, కోశాధికారి పీవీ సత్యనారాయణరావు తదితరులు ఉన్నారు.

 


 

మరిన్ని వార్తలు