అమరావతి: వచ్చే ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్లో లక్ష మందికి ఐటీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. హెచ్సీఎల్ టెక్నాలజీస్ సంస్థ ఏపీలో ఐటీ సర్వీసులు ప్రారంభించేందుకు ఎంవోయూ కుదుర్చుకున్న సందర్భంగా బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని, వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అప్పుడే 31 రోజులు పూర్తయ్యాయని అన్నారు.
రాష్ట్రానికి నమ్మకమైన ముఖ్యమంత్రి దొరికారని, అంతకంటే మించి మంచి మార్కెటింగ్ నైపుణ్యం (మార్కెటింగ్ స్కిల్స్) ఉన్న వ్యక్తి అని ఆయన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. మాన్యుఫాక్చరింగ్ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు, ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్నామని అన్నారు. కాగా రాష్ట్రాన్ని స్వచ్ఛభారత్లో మొదటి స్థానంలో నిలిపేవరకు నిద్రపోనని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.