పెళ్లి చూపుల ఫొటో​కు వెళ్లి టెక్కీ..

11 Jun, 2017 09:42 IST|Sakshi
పెళ్లి చూపుల ఫొటో​కు వెళ్లి టెక్కీ..

కర్నూలు: బెంగుళూరులోని ఓరాకిల్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి (31) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.  ఇతని సొంత ఊరు వేంపెంట. బావ లక్ష్మన్న కర్నూలులో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ టెలికాం నగర్‌లో నివాసముంటున్నాడు. శనివారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి జగన్‌మోహన్‌రెడ్డి.. బావ ఇంటికి వచ్చాడు. పెళ్లి చూపులకు సంబంధించిన ఫొటోలు దిగేందుకు సాయంత్రం బావ లక్ష్మన్నతో కలసి ఏపీ21 బీసీ 6992 ప్యాషన్‌ ప్రో వాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

లక్ష్మన్న వాహనం నడుపుతుండగా జగన్‌మోహన్‌రెడ్డి వెనక కూర్చున్నాడు. పాత ఆర్‌టీఓ కార్యాలయం దగ్గరకు వెళ్లగానే లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో రోడ్డుపై పడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే మూడో పట్టణ ఎస్‌ఐ మల్లికార్జున సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.  

మరిన్ని వార్తలు