అనుసంధానం కలే..

5 Nov, 2013 04:41 IST|Sakshi

 కందుకూరు, న్యూస్‌లైన్: ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో సోమశిల-రాళ్లపాడు అనుసంధానం పనులు నాలుగేళ్లుగా కలగానే మిగిలిపోయాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టును ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని రాళ్లపాడు ప్రాజెక్టుతో అనుసంధానం చేస్తే ఈ ప్రాంత రైతాంగానికి మేలు జరుగుతుందని భావించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి కలలను ప్రస్తుత పాలకులు కల్లలు చేశారు. ఆయన రెక్కల కష్టం మీద ఏర్పడిన ప్రభుత్వంలో ఉండి పదవులు అనుభవిస్తున్న మంత్రులు సైతం ప్రాజెక్టు అనుసంధానం పనులను పట్టించుకోవడం లేదు. వైఎస్ చలవతో శాసనసభకు ఎన్నికై ప్రస్తుతం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న మానుగుంట మహీధర్‌రెడ్డి అసలు ఈ ప్రాజెక్టు ఊసే మరిచిపోయారు. 2007లో వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు .
 
 కందుకూరు ప్రాంతానికి వచ్చి ఇక్కడి రైతుల గోడు విని చలించి సోమశిల ప్రాజెక్టుతో రాళ్లపాడును అనుసంధానం చేస్తానని హామీ ఇచ్చారు.  సోమశిల ప్రాజెక్టు ఉత్తర కాలువను రాళ్లపాడు ప్రాజెక్టుకు అనుసంధానం చేసేందుకు రూ. 176 కోట్లు మంజూరు చేశారు. ఆ వెంటనే పనులు ప్రారంభించేలా రూపకల్పన చేశారు. అయితే అప్పట్లో హడావిడిగా ప్రారంభించిన పనులు ఏడాది కూడా సక్రమంగా జరగనేలేదు.


 2007లో ప్రారంభమైన ఈ పనులు 2009కి పూర్తికావాల్సి ఉంది. మొత్తం సోమశిల ప్రాజెక్టు నుంచి ఉత్తర కాలువ 105 కిలోమీటర్ల మేర ఉండి రాళ్లపాడు ప్రాజెక్టుతో అనుసంధానం కావాల్సి ఉంది. అయితే 0-72వ కిలోమీటరు వరకు వివిధ ప్యాకేజీల్లో పనులు జరుగుతున్నప్పటికీ అక్కడి నుంచి 105వ కిలోమీటరు అంటే రాళ్లపాడులో కలిసే వరకు పనులు సక్రమంగా సాగడం లేదు.  పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సగానికి వచ్చి కాలువ పనులు ఆగిపోయాయి. మరో మూడు కిలో మీటర్లు కాలువ పనులు పూర్తి చేస్తే రాళ్లపాడులోకి నీరు చేరుతుంది.
 
 మొత్తం సోమశిల ఉత్తర కాలువ పనులు 96 ప్యాకేజీలతో జరగాల్సి ఉంది.  96వ ప్యాకేజీలో 72వ కిలోమీటరు నుంచి రాళ్లపాడులో కలిసే 105వ కిలోమీటరు వరకు పనులు చేయాలి. కాల పరిమితి రెండేళ్లు. కాలువ పరిధిలో 53 కట్టడాలు, కాలువ తవ్వకం, లైనింగ్ పనులు చేపట్టాలి. ఈ పనులు కూడా 2007లోనే మంజూరుకాగా 2009 కల్లా పూర్తి చేయాల్సి ఉంది. కాలువ తవ్వకం పనులు 32 కిలోమీటర్లకు గాను దాదాపు 29 కిలోమీటర్లు పూర్తయ్యాయి. 53 కట్టడాలకు 6 మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయి. మొత్తం ఇప్పటి వరకు మొదటి విడతగా రూ. 73 కోట్లలో రూ. 26 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.


 రాళ్లపాడు అనుసంధానం పనులు 72వ కిలోమీటర్ నుంచి చేపట్టిన కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు చేయకుండా ఆపివేశాడు. కాంట్రాక్టర్‌కు అధికారులు ఎన్నిసార్లు నోటీసులిచ్చినా పనులు ప్రారంభించలేదు. దీనికి తోడు 72వ కిలోమీటరుకు పై భాగంలో అటవీ శాఖ అనుమతులు తీసుకోవడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
 
 గత ఐదేళ్లలో పంటలు పండింది రెండేళ్లే...
 రాళ్లపాడు ప్రాజెక్టు పరిధిలో గత ఐదేళ్లలో నీరు సక్రమంగా లేకపోవడం వల్ల పంటలు పండింది కేవలం రెండేళ్లు మాత్రమే. ఈ ప్రాంత రైతాంగం అతివృష్టి, అనావృష్టితో అల్లాడుతుంటే పాలకులు కళ్లప్పగించి చూస్తున్నారు. సోమశిల ప్రాజెక్టు జలకళతో నిండు కుండలా తొణికిసలాడుతోంది. 78 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 65 టీఎంసీల నీరుంది. సోమశిల నుంచి రాళ్లపాడుకు కేవలం రెండు టీఎంసీల నీరు మాత్రమే విడుదల చేయాల్సి ఉంది. ఈ రెండు టీఎంసీలు నీరు వచ్చి చేరితే రాళ్లపాడు పరిధిలోని భూములన్నీ సస్యశ్యామలమవుతాయి. మొత్తం 25 వేల ఎకరాల ఆయకట్టు ఉన్న ప్రాజెక్టు పరిధిలో అదనంగా మరో 15 వేల ఎకరాలకు ఈ అనుసంధానం ద్వారా  సాగునీరు అందించవచ్చు. సాగునీటితోపాటు తాగునీరు కూడా పుష్కలంగా లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. 20.5 అడుగుల సామర్థ్యంతో ఉన్న రాళ్లపాడు ప్రాజెక్టులో ప్రస్తుతం ఆరడుగులు మాత్రమే నీళ్లు వచ్చి చేరాయి. ప్రజాప్రతినిధులు చొరవ చూపి సోమశిల, రాళ్లపాడు ప్రాజెక్టుల అనుసంధానం పనులు సత్వరం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
 
 కాలువ డిజైన్ మార్చడం వల్ల ఆలస్యం
 సోమశేఖర్, సోమశిల ప్రాజెక్టు ఎస్‌ఈ
 సోమశిల ఉత్తర కాలువ చివరి భాగం కాలువ డిజైన్లు మార్చడం వల్ల పనులు ఆలస్యమయ్యాయి. మొదట ఇచ్చిన టెండర్‌ను ఆ ఏజెన్సీ చేయలేకపోయింది. దీంతో 72వ కిలో మీటర్ నుంచి కొత్త ఏజెన్సీకి పనులు అప్పగించాం. దీని వల్ల పనులు ఆలస్యంగా జరిగినప్పటికీ త్వరితగతిన పూర్తి చేయించేందుకు ప్రస్తుతం కఠిన చర్యలు తీసుకుంటున్నాం. రాళ్లపాడు ప్రాజెక్టుకు వచ్చే కాలువ డిజైన్‌ను మార్చి వెడల్పు ఎక్కువ చేసి నిర్మాణ పనులు చేపట్టాం.
 

మరిన్ని వార్తలు