ఎస్పీ బదిలీకి బ్రేక్

28 Nov, 2013 04:05 IST|Sakshi

కర్నూలు, న్యూస్‌లైన్:  జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి బదిలీ వ్యవహారం ఉత్కంఠకు తెరపడింది. ఈయనను హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా బదిలీ చేసి రమేష్ నాయుడును జిల్లా ఎస్పీగా నియమిస్తూ గత నెల 27న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. అయితే కర్నూలులో బాధ్యతలు చేపట్టి మూడున్నర మాసాలు గడవక మునుపే నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారంటూ ఎస్పీ కేంద్ర ప్రభుత్వ ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు. ఎలాంటి ఆరోపణలు లేని ఐపీఎస్ అధికారిని రెండేళ్లలోపు బదిలీ చేయరాదనే నిబంధన నేపథ్యంలో  క్యాట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది.

ప్రకాషింగ్ కమిటీ, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా బదిలీ ఉండాలని క్యాట్‌లో ఎస్పీ తన వాదనను వినిపించారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కారణాలను వెల్లడించకపోవడంతో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు రఘురామిరెడ్డినే ఎస్పీగా కొనసాగించాలని క్యాట్ ఆదేశించింది. ఎస్పీ బదిలీ నేపథ్యంలో సంబరాలు చేసుకున్న సొంత శాఖలోని ఆయన వ్యతిరేకులు, కొందరు రాజకీయ నాయకులు తాజా తీర్పును జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది.
 

మరిన్ని వార్తలు