ఉద్యోగ విప్లవం

20 Sep, 2019 09:20 IST|Sakshi

సచివాలయ పరీక్షల ఫలితాలు విడుదల

రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన జిల్లా వాసులు

కలా.. నిజమా! వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చీరాగానే సచివాలయ వ్యవస్థకు రూపకల్పన చేయడం.. ఉద్యోగ ప్రకటన చేయడం.. పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటించడం.. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగిన ఎంపికలో సామాన్యులెందరికో అర్హత లభించడం.. నిజంగా ఇది నిజమేనా! ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న అభ్యర్థుల మనోభావమిది.. ఉన్న ఉద్యోగాలనే తొలగించిన పాత సర్కారుకు.. చెప్పిన దానికన్నా ఎక్కువ మేలు చేస్తున్న జగన్‌ ప్రభుత్వానికీ తేడా వారికి స్పష్టంగా తెలుస్తోంది.  

సాక్షి, అరసవల్లి: గ్రామ/వార్డు సచివాలయాల పోస్టులకు గాను నిర్వహించిన పరీక్షల ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. జిల్లాలో మొత్తం 7884 పోస్టులు ఉన్నాయి. ఈనెల 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించారు. మొత్తం 1,14,734 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 1,04326 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇదివరకెన్నడూ ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరగకపోవడంతో తీవ్ర పోటీ నెలకొంది. వచ్చే నెల 2వ తేదీ నుంచి జిల్లాలో 835 గ్రామ సచివాలయాలు, 94 వార్డు సచివాలయాలను ప్రారంభించనున్న నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి ఇటీవల  నిర్వహించిన పరీక్షల ఫలితాలను పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు గురువారం విడుదల చేశారు. మొత్తం 19 విభాగాల్లో పారదర్శకంగా నిర్వహించిన ఈ పరీక్షల్లో స్థానిక జిల్లావాసుల్లో అధిక శాతం మంది క్వాలీఫై మార్కులను పొందారు. ఇందులో కొందరు రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి ఉత్తమ స్థానాలను సొంతం చేసుకున్నారు.

 ‘టాప్‌’ లేపారు..
గ్రామ/వార్డు సచివాలయాల్లో నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది, ఇందులో భాగంగా పరీక్షల్లో ఓపెన్‌ కేటగిరిలో కనీస ఉత్తీర్ణత మార్కులుగా 40 శాతం మార్కులు, బీసీ సామాజిక వర్గాల అభ్యర్థులకు 35 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 శాతం మార్కులు సాధించిన వారిని క్వాలీఫై అయినట్లుగా ఆన్‌లైన్‌లో జాబితాలను పెట్టారు. ఈమేరకు గురువారం విడుదలైన పరీక్షల ఫలితాల్లో చిక్కోలుకు చెందిన పలువురు యువతీయువకులు ఉత్తమ ప్రతిభను కనబరిచి, రాష్ట్ర స్థాయిలో జిల్లా ఖ్యాతిని నిలబెట్టారు.


రేపటి నుంచి వెరిఫికేషన్‌..
గ్రామ/వార్డు సచివాలయాల పోస్టుల పరీక్షల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఈనెల 21 నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారు మాత్రమే ఈమేరకు తమ సర్టిఫికేట్లను వెరిఫికేషన్‌ నిమిత్తం అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. కాల్‌ లెటర్లను ఈనెల 21 నుంచి 22లోగా పంపిణీ చేయనున్నారు. అనంతరం ఎంక్వైరీ ప్రక్రియ ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు. అనంతరం ఈనెల 27న నియామక పత్రాలను ఉన్నతాధికారుల చేతుల మీదుగా అందించనున్నారు. అక్టోబర్‌ 1, 2 తేదీల్లో విధులపై అవగాహన అనంతరం అక్టోబర్‌ 2 నుంచి గ్రామ/వార్డు సచివాలయాలు పనిచేయనున్నాయి.   

>
మరిన్ని వార్తలు