విద్యార్థి ప్రాణం తీసిన టూరిస్టు బస్సు

28 Nov, 2014 01:48 IST|Sakshi

పెద్దదోర్నాల : పదో తరగతి విద్యార్థిని ఓ టూరిస్టు బస్సు మృత్యువు రూపంలో వచ్చి కబళించింది. ఈ సంఘటన మండల పరిధిలోని రామచంద్రకోటలో గురువారం జరిగింది. వివరాలు.. చిన్న దోర్నాలకు చెందిన గోతం విక్రమ్(15) రామచంద్రకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.

పాఠశాలకు వచ్చిన విక్రమ్.. మార్కాపురంలో అనారోగ్యంతో బాధపడుతున్న తాతను చూసేందుకు ఉపాధ్యాయుల అనుమతితో వెళ్లాడు. తిరిగి ఆటోలో పాఠశాల వద్ద దిగి స్డడీ అవర్  కోసం లోనికి వెళ్తున్నాడు. ఇంతలో ఓ టూరిస్టు బస్సు వేగంగా వచ్చి విక్రమ్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడటంతో ఉపాధ్యాయులు 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అనంతరం హుటాహుటిన దోర్నాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విక్రమ్ మృతి చెందాడు. ఎస్సై బ్రహ్మనాయుడు తన సిబ్బందితో కలిసి వైద్యశాలకు చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

 సహచరుల్లో విషాద ఛాయలు                        
  రోడ్డు ప్రమాదంలో విక్రమ్ మరణించాడని తెలిసి సహచర విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుని తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయినులు భోరున విలపించారు. విద్యార్థి తల్లిదండ్రులు వెంగయ్య, తిరుపతమ్మలు దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ జంకె ఆవులరెడ్డిలు ఆస్పత్రికి వచ్చి విక్రమ్ మృతదేహానికి నివాళులర్పించారు.

 ైవె ద్యులపై చర్యలు తీసుకోవాలి
 తీవ్రంగా గాయపడిన విద్యార్థికి సరైన వైద్యం చేయని వైద్యులపై చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. వైద్యశాల ఎదుట భైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విక్రమ్‌కు సరైన వైద్యం అందించి ఉంటే బతికే వాడన్నారు. ఖాళీ సిలండర్ పెట్టటం వ ల్ల ఆక్సిజన్ అందక విక్రమ్ మృతి చెందాడని ఆరోపించారు. ఎస్సై బ్రహ్మనాయుడు తన సిబ్బందితో కలిసి ఆందోళనకారులకు సర్దిచెప్పి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

మరిన్ని వార్తలు