‘రెండేళ్లలోనే టీడీపీ గ్రాఫ్‌ పడిపోయింది’

19 May, 2019 22:27 IST|Sakshi

వైఎస్సార్‌సీపీకి 133-135 స్థానాలు

సీపీఎస్‌ చీఫ్‌ వేణుగోపాల్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టింస్తుందని సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌ (సీపీఎస్‌) పోస్ట్‌ పోల్‌ సర్వే చీఫ్‌ వేణుగోపాల్‌ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ అంశాన్ని తీసుకున్నా వైఎస్సార్‌సీపీకే అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల నుంచే చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, గత రెండేళ్లుగా టీడీపీ గ్రాఫ్‌ పడిపోయిందని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4లక్షలకు పైగా శాంపిల్స్‌ సేకరించి సర్వే చేపట్టినట్లు వేణుగోపాల్‌ వివరించారు. చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతతోనే వైఎస్‌ జగన్‌కు పట్టం కట్టారని ఆయన పేర్కొన్నారు. కేవలం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు అవకాశంఇచ్చారని, కానీ  ప్రజల అంచనాలను ఆయన అందుకోలేకపోయారని తెలిపారు.

ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పకుండా.. కేవలం సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని అన్నారు. ​ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ 133-135 స్థానాలను గెలుపొందనుందని, అధికార టీడీపీ కేవలం 37 నుంచి 40 సీట్లు మాత్రమే విజయం సాధిస్తుందని సీపీఎస్‌ సర్వే వెల్లడించింది. పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ  సున్నా లేదా ఒక్క స్థానం గెలిచే అవకాశముందని, ఐదు స్థానాల్లో హోరాహోరీ పోటీ నెలకొని ఉంటుందని పేర్కొంది. వైఎస్సార్‌సీపీకి 50.1% శాతం ఓట్లు వస్తాయని, టీడీపీకి 40.2% శాతం ఓట్లు, జనసేనకు 7.3% శాతం ఓట్లు, ఇతరులకు 2.6% శాతం ఓట్లు వస్తాయని సీపీఎస్‌ వెల్లడించింది.

మరిన్ని వార్తలు