హైటెక్‌ ‘సాయి’

28 Apr, 2019 10:00 IST|Sakshi

కమలాపురంలో నివాసం.. పెద్దచెప్పలి సింగిల్‌విండో అధ్యక్షపదవి

విచారణ చేపట్టడంలో పోలీసుల ఉదాసీనత

 చిన్నచౌక్‌ అడ్రసుతో పాయింట్‌ 32 పిస్తోల్‌ లైసెన్సు

ఎన్నికల నేపథ్యంలో తుపాకీ డిపాజిట్టు సరే... రశీదు పోలీసులకు అప్పగించని వైనం

బుల్లెట్లు పట్టుబడటంతో వెలుగులోకి వచ్చిన విషయం

సాక్షి ప్రతినిధి కడప: సాయినాథశర్మ...కమలాపురం ప్రాంతవాసులకు సుపరిచితుడు. పాత్రికేయునిగా గుర్తింపు పొంది, ఆపై హైటెక్‌ రాజకీయ నాయకుడుగా రూపాంతరం చెందారు. వర్గ నాయకులను కాదని అనూహ్యంగా పెద్దచెప్పలి సింగిల్‌విండో అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. అచ్చం అదే తరహాలో పోలీసు, రెవెన్యూశాఖలను మేనేజ్‌ చేసి గుట్టుచప్పుడు కాకుండా తప్పుడు అడ్రసుతో పిస్తోల్‌ లైసెన్సు దక్కించుకున్నారు. బుల్లెట్లతో రేణిగుంట ఎయిర్‌పోర్టులో పట్టుబడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దచెప్పలి సింగిల్‌విండో అధ్యక్షుడు సాయినాథశర్మ 1980వ దశకం నుంచి కమలాపురంలో నివాసం ఉంటున్నారు.

అయ్యప్పస్వామి దేవస్థానం సమీపంలో సొంత ఇళ్లు ఉంది. డోర్‌ నంబర్‌ 13/104లో దాదాపు 8 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. అందులోనే ఆధార్, ఫాన్‌కార్డు, ఓటరు కార్డు  తదితర ప్రభుత్వం మంజూరు చేసే గుర్తింపు కార్డులు ఉన్నాయి. కాగా చిన్నచౌక్‌ పరిధిలో డోర్‌ నంబర్‌ 36/221లో నివాసం ఉన్నట్లుగా 2015లో తుపాకీ లైసెన్సుకు దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలించిన పోలీసు యంత్రాంగం విచారణ చేపట్టి లైసెన్సు తుపాకీ అవసరం ఉన్నట్లు గుర్తించి సిఫార్సులు చేశారు. ఆమేరకు 2016 నవంబర్‌ 3న అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ లైసెన్సు జారీ చేశారు. అయితే ఈ వ్యవహారం అత్యంత గుట్టుచప్పుడు కాకుండా నడిచింది. కారణం కమలాపురం నివాసికి కడప చిన్నచౌక్‌ పరిధిలో లైసెన్సు మంజూరు చేయడమే.

తుపాకీ లైసెన్సుకు దరఖాస్తు చేస్తే, దరఖాస్తుదారుడికి లైసెన్సు తుపాకీ అవసరమా..లేదా... దానిని అడ్డుపెట్టుకొని దందాలు చేసే అవకాశం ఉందా...అన్న విషయాన్ని ధ్రువీకరించాల్సింది పోలీసులు. వారి సిఫార్సులు ఆధారంగానే లైసెన్సుపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా సాయినాథశర్మ కమలాపురం ప్రాంత నివాసి అయి ఉండీ, కడప నగరం చిన్నచౌక్‌లో 36/221లో నివాసం ఉన్నట్లుగా దరఖాస్తు చేస్తే చిన్నచౌక్‌ పోలీసులు సిఫార్సు చేశారు. వారి సిఫార్సు ఆధారంగా లైసెన్సు మంజూరు చేస్తూ అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కమలాపురంలో నివాసం ఉన్న సాయినాథ్‌ను కడపలో ఉంటున్నట్లు అప్పటి చిన్నచౌక్‌ సీఐ రామకృష్ణ ధ్రువీకరించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో చేపట్టారా...టీడీపీ నేతల సిఫార్సులతో సీఐ ధ్రువీకరించారా అన్న విషయం తెలియాల్సి ఉంది. పదేళ్లుగా కమలాపురం నుంచి ఎక్కడికి నివాసం మార్చని సాయినాథ్‌ చిన్నచౌక్‌ అడ్రసులో ఎలా లైసెన్సు పొందారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగులుతోంది.

బుల్లెట్లు పట్టుబడడంతో....
2017 నవంబర్‌ 3న పాయింట్‌ 32 పిస్తోల్‌ లైసెన్సు పొందిన సాయినాథశర్మ మార్చి 13న ఏషియన్‌ ఆర్మ్స్‌ సంస్థల్లో తన తుపాకీ డిపాజిట్టు చేశారు. అయితే బుల్లెట్లు తనవద్దే ఉంచుకున్నారు. స్థానికంగా పోలీసుస్టేషన్‌లో తుపాకీ అప్పగిస్తే.. బుల్లెట్లు లైసెన్సు రికార్డులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తుపాకులు విక్రయించే లైసెన్సు గోడౌన్లో లైసెన్సుదారుడు తన వెపన్‌ డిపాజిట్టు చేస్తే ఒరిజనల్‌ రశీదును పోలీసుస్టేషన్‌లో అప్పగించాలి. చిన్నచౌక్‌ పోలీసు స్టేషన్‌లో సాయినాథశర్మ తుపాకీ డిపాజిట్టు చేసినట్లు ఒరిజనల్‌ రశీదు ఇవ్వలేదు.

కేవలం వాట్సాప్‌లో రశీదు ఫోటో మాత్రమే పంపించి చేతులు దులుపుకున్నారు. తప్పుడు నివాసంతో లైసెన్సు మం జూరుకు సిఫార్సు చేసిన చిన్నచౌక్‌ పోలీసులు, తుపాకీ డిపాజిట్టు చేసుకోవడంలో కూడా అలాంటి ధోరణే ప్రదర్శించారు.  వాస్తవంగా రేణిగుంట ఎయిర్‌పోర్టు తనిఖీలో బుల్లెట్లు పట్టుబడకపోతే, సాయినాథశర్మ తుపాకీ లైసెన్సు విషయం వెలుగు చూసే అవకాశమే లేదు. నిజాయితీకి మారుపేరుగా ఎన్నికలు అత్యంత నిష్పక్షపాతంగా నిర్వహించిన ఎస్పీ అభిషేక్‌మహంతి ఉన్నచోటే, కిందిస్థాయి సి బ్బంది కారణంగా పోలీసుశాఖ ప్రతిష్ట మంటగలుస్తోందని పలువురు వాపోతుండడం గమనార్హం.   

>
మరిన్ని వార్తలు