కర్నూలు: నంద్యాలలో చంద్రబాబు నాయుడుకు ఓటమి భయం పట్టుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అందుకే ప్రలోభాలు, వేధింపులకు పాల్పడుతూ హామీలు కుమ్మరిస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ సీపీ నేతలతో పాటు సామాన్య ప్రజలను కూడా టీడీపీ నేతలు భయపడుతున్నారన్నారు. బుధవారమిక్కడ వైఎస్ఆర్ సీపీ నేతలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గంగుల ప్రభాకర్రెడ్డి, పీపీ నాగిరెడ్డి, గౌరు వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, బుడ్డా శేషారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
టీడీపీ నేతల అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, నంద్యాల ఉప ఎన్నిక కారణంగానే చంద్రబాబు హడావుడి చేస్తున్నారన్నారు. అందుకే సడన్గా ఆయనకు నంద్యాలపై ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. ఓట్ల కోసం కపట ప్రేమను నటిస్తున్నారన్నారు. సంతలో పశువులను కొన్నట్లే నేతలను కొంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికుట్రలు పన్నినా నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ గెలవడం ఖాయమన్నారు. నంద్యాల ప్రజలు కచ్చితంగా చంద్రబాబుకు బుద్ధి చెబుతారని అన్నారు.