‘పవన్‌ కళ్యాణ్‌ ఇంటిని ముట్టడిస్తాం..’

6 Feb, 2018 19:06 IST|Sakshi
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌

సాక్షి, అనంతరపురం: మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. కానీ పవన్‌ వ్యాఖ్యలపై గిరిజన జేఏసీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పవన్‌ కళ్యాణ్‌ ఇంటిని ముట్టడించడానికి కూడా తాము వెనుకాడబోమని వారు హెచ్చరించారు. మంగళవారం స్థానిక నాగులకట్ట వద్ద విలేకరుల సమావేశంలో గిరిజన జేఏసీ పుట్టపర్తి కన్వీనర్‌ కే. రవీంద్ర నాయక్‌, కో కన్వీనర్‌ కుళ్లాయి నాయక్‌, జిల్లా యువజన విభాగం కన్వీనర్‌ ఎస్‌. నారాయణస్వామి నాయక్‌ మాట్లాడారు.

మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని.. ఇందుకు తాను మద్దతిస్తానని, ప్రభుత్వంతో కూడా మాట్లాడతానని పవన్‌ చెప్పడం గర్హనీయమన్నారు. గిరిజనుల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో దీన్నిబట్టి అర్ధమవుతోందన్నారు. వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయిస్తే ఆ అడుగుజాడల్లోనే పవన్‌ నడవటం విచారకరమని గిరిజన నాయకులు అ‍న్నారు. 

పవన్‌ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ గిరిజనుల ఆగ్రహం చవిచూడక తప్పదన్నారు.
 

మరిన్ని వార్తలు