ధ్వజమెత్తిన మేయర్ శ్రీధర్
విజయవాడ సెంట్రల్ : కాంగ్రెస్ ఓ దొంగల పార్టీ అని, దొంగలకు కొమ్ముకాసేందుకే ధర్నా చేస్తామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారని మేయర్ కోనేరు శ్రీధర్ ధ్వజమెత్తారు. కార్పొరేషన్ చాంబరులో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. నగరపాలక సంస్థను లూటీ చేసిన కాంగ్రెస్ నాయకులు పన్ను భారాల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సమగ్ర సర్వేను తప్పుబడుతూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధర్నా చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. నగరపాలక సంస్థ ఆదాయ, వ్యయాలను తెలియజేస్తూ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. 010 పద్దు కింద జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన అప్పటి ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యే విష్ణులు ఉద్యోగుల్ని దగా చేశారన్నారు.
కమిషన్ల కోసం అవసరం లేకున్నా వాహనాలను కొనుగోలు చేశారన్నారు. కార్పొరేషన్ పాలక మండలి బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.180 కోట్లు నిధులు తీసుకువచ్చినట్లు వివరించారు. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ఐదు నెలల జీతాలు చెల్లించడంతో పాటు, కాంట్రాక్టర్ల బిల్లులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. సమావేశంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు పాల్గొన్నారు.