ఉక్కునగరం: విశాఖ స్టీల్ప్లాంట్ వైర్ రాడ్ మిల్ – 2 విభాగంలో ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో విధులకు వచ్చిన అనంతరం విషం తాగాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... చిత్తూరు జిల్లాకు చెందిన విభాగం సీనియర్ టెక్నీషియన్ ఉయ్యాల జయచంద్రన్ (50) కుటుంబంతో రాసాలమ్మ కాలనీలో నివసిస్తున్నాడు. శుక్రవారం జనరల్ షిఫ్ట్ విధులకు హాజరయ్యాడు. అనంతరం ఉదయం 10 గంటల సమయంలో ఫినిషింగ్ ఏరియాలో కూల్డ్రింక్లో విషం కలిపి తాగేశాడు.
దీంతో కొద్దిసేపటికి అక్కడ కుప్పకూలిపోయాడు. నోటిలో నుంచి నురగ వస్తుండటంతో గమనించిన సహోద్యోగులు ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి జనరల్ ఆస్పత్రికి... ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబంలో విషాదచాయలు అలముకున్నాయి.