-

స్టైరిన్‌ తరలింపు ప్రక్రియ ప్రారంభం

11 May, 2020 15:03 IST|Sakshi

సాక్షి, విశాఖ : ఎల్జీ పాలిమర్స్‌లో లీకైన స్టైరిన్‌ను తరలించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించినట్లు జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ తెలిపారు. స్టైరిన్‌ను తరలించే ప్రక్రియ ప్రారంభమైందని, ఎల్జీ పాలిమర్స్‌లో పరిస్థితి అదుపులో ఉందన్నారు.  లీకైన ట్యాంక్‌తో పాటు అయిదు ట్యాంకుల్లో 12 నుంచి 13వేల టన్నుల స్టైరిన్‌ ఉందని, వాటిని నౌకల ద్వారా కొరియాకు తరలించనున్నట్లు చెప్పారు. మూడు నుంచి అయిదు రోజుల్లో తరలింపు ప్రక్రియ పూర్తి అవుతుందని కలెక్టర్‌ వెల్లడించారు. (బాధితులను ఇళ్లకు చేర్చండి: సీఎం జగన్)

అలాగే బాధితులకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారని, ఇప్పటికే మృతుల కుటుంబాలకు కోటి పరిహారం అందించినట్లు చెప్పారు. బాధిత గ్రామాలలో ఇంటిలో ప్రతి కుటుంబ సభ్యునికి పదివేల రూపాయలు ఆర్దిక సహాయం అందచేస్తామన్నారు. ఒక్కొక్కరికి రూ.10వేలు పరిహారం రేపటి (మంగళవారం) నుంచి అందిస్తామన్నారు. ఇవాళ సాయంత్రానికి డీశానిటైజేషన్‌ పూర్తయ్యాక... కోలుకున్న వారితో పాటు పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని గ్రామాలకు తరలిస్తామని, బాధితులకు పూర్తి భరోసా కల్పిస్తామన్నారు. గ్రామంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇక స్టైరిన్‌ గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, వైద్య బృందాలు, జీవీయంసీ పారిశుద్ద్య బృందాలు నిర్విరామంగా పని చేస్తున్నాయన్నారు. (బాధితులను ఇళ్లకు చేర్చండి: సీఎం జగన్)


 

మరిన్ని వార్తలు