సోషల్ మీడియా ఆధారంగా చేపట్టే కార్యక్రమాలను తాము అనుమతించేది లేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. పెద్ద కార్యక్రమాలు జరిగేటప్పుడు వాటి నిర్వాహకులు ఎవరన్న విషయం ముఖ్యమని.. కానీ సోషల్ మీడియా ఆధారంగా జరిగే కార్యక్రమాలకు ఓనర్ షిప్ ఉండదని ఆయన చెప్పారు. విశాఖలో ఈనెల 26వ తేదీన తలపెట్టిన దీక్షకు అనుమతి కావాలని ఎవరూ తమను కోరలేదన్నారు. తమకు శాంతిభద్రతలే ముఖ్యమని.. పోలీసు ఆంక్షలకు అంతా సహకరించాలని చెప్పారు.
ఏక్షణంలోనైనా హౌస్ అరెస్టు
శాంతిభద్రతలకు భంగం కలిగించే ఆందోళన దేన్నీ తాము అంగీకరించబోమని డీజీపీ సాంబశివరావు తెలిపారు. ముద్రగడ పద్మనాభం సహా ఎవరైనా అనుమతి తీసుకోవాల్సిందేనని ఆయన అన్నారు. కాపు సత్యాగ్రహ దీక్ష నేపథ్యంలో తాము ఏక్షణమైనా ముద్రగడను హౌస్ అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పారు.
కాగా, కాపు రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బుధవారం నుంచి సత్యాగ్రహ యాత్ర తలపెట్టారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి అంతర్వేది వరకు ఈ యాత్ర సాగనుంది. ఆయనకు సంఘీభావం తెలిపేందుకు కాపునేతలు భారీగా చేరుకుంటున్నారు. ముద్రగడ నివాసం వద్ద పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించి, మీడియాపై కూడా ఆంక్షలు పెట్టారు.