నేడు అసెంబ్లీలో మహిళా భద్రత బిల్లు

11 Dec, 2019 06:19 IST|Sakshi

బిల్లుపై చర్చించి ఆమోదించనున్న మంత్రివర్గం

అనంతరం శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనున్న సర్కారు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేలా సరి కొత్త చట్టం తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా భారత శిక్షా స్మృతి(ఐపీసీ–ఇండియన్‌ పీనల్‌ కోడ్‌)లోని సెక్షన్‌ 354కు సవరణలు చేసి.. కొత్తగా 354–ఈని చేర్చనుంది. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడితే.. అలాంటి కేసులపై వారం రోజుల్లోగా విచారణ పూర్తి చేసి, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేసి రెండు వారాల్లోగా ట్రయల్‌ పూర్తి చేసి శిక్షపడేలా చేయడం ఈ చట్టం ఉద్దేశం.

ఇలాంటి కేసుల్లో రెడ్‌ హ్యాండెడ్‌గా ఆధారాలుంటే నిందితులకు మూడు వారాల్లోగా ఉరిశిక్ష విధించడానికి ఈ చట్టం దోహదం చేస్తుంది. ఈ విప్లవాత్మక చట్టాన్ని అమల్లోకి తేవడానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నడుంబిగించారు. ఇందుకు సంబంధించిన బిల్లుపై చర్చించి.. ఆమోదించడానికి సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో మంత్రివర్గం బుధవారం సమావేశం కానుంది. మహిళా భద్రత బిల్లుపై ఆమోదముద్ర వేశాక శాసనసభ, మండలిలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. 

మరిన్ని వార్తలు