సాక్షి, పార్వతీపురం: ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నానని భరోసానిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో మైలురాయి చేరుకోంది. జననేత చేపట్టిన పాదయాత్ర నేటితో దిగ్విజయంగా 300 రోజులకు చేరింది. ప్రస్తుతం పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 300వ రోజు పాదయాత్రను ఆదివారం ఉదయం పార్వతీపురం నియోజకర్గంలోని కోటవానివలస నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర బంటువాణి వలస, అడ్డాపుశీల క్రాస్, బచి జంక్షన్ మీదుగా సీతాపురం క్రాస్ వరకు కొనసాగుతుంది. అక్కడ జననేత భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత జననేత పాదయాత్ర కురుపాం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. నియోజకర్గంలోని ఉల్లిభద్ర, గురుగుబిల్లి క్రాస్, రామినాయుడు వలస మీదుగా తోటపల్లి రిజర్వాయర్ వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది.
వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు.