బజరంగ్‌ పూనియాకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

20 Aug, 2018 09:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇండోనేషియాలో కొనసాగుతున్న ఆసియా క్రీడల్లో పతకాలు గెలుపొందిన భారత ఆటగాళ్లకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్విటర్‌లో అభినందనలు తెలిపారు. భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించిన రెజ్లర్‌ బజరంగ్‌ పూనియాకు, షూటింగ్‌లో కాంస్య పతకాలు సాధించిన అపూర్వీ చండేలా, రవికుమార్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు.

అధికారికంగా ఆసియా క్రీడలు మొదలైన తొలి రోజే భారత్‌ బంగారంతో బోణీ చేసింది. భారత యువ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా పసిడి పట్టుతో అదరగొట్టాడు. ఫ్రీస్టయిల్‌ 65 కేజీల విభాగంలో ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన బజరంగ్‌ ఎదురులేని విజేతగా అవతరించాడు.  ఫైనల్లో బజరంగ్‌ 11–8 పాయింట్ల తేడాతో తకతాని దైచి (జపాన్‌)పై గెలుపొంది గోల్డ్‌ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. తొలి రోజు బజరంగ్‌ మినహా మిగతా భారత రెజ్లర్లు సందీప్, సుశీల్‌ కుమార్, పవన్, మౌజమ్‌ ఖత్రి పతకం నెగ్గడంలో విఫలమయ్యారు. మరోవైపు షూటింగ్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో రవికుమార్‌–అపూర్వీ చండేలా ద్వయం మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.

మరిన్ని వార్తలు