ఇళ్ల పట్టాల పంపిణీ 14కు వాయిదా

21 Mar, 2020 03:49 IST|Sakshi

అంబేడ్కర్‌ జయంతి రోజున కార్యక్రమం 

జిల్లా కలెక్టర్లు,ఎస్పీల కాన్ఫరెన్స్‌లో సీఎం వైఎస్‌ జగన్‌      

కరోనా వైరస్‌ నివారణ నేపథ్యంలో నిర్ణయం 

సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తూ లబ్ధిదారులకు స్థలాలు చూపించాలి

సాక్షి, అమరావతి: పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఏప్రిల్‌ 14వ తేదీ అంబేడ్కర్‌ జయంతి రోజుకు వాయిదా వేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు చేపడుతున్నందున ఉగాది రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం లేదన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా ఇళ్ల స్థలాల పట్టాలు, ప్లాట్ల అభివృద్ధికి సంబంధించి కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. కరోనా వైరస్‌ను నియంత్రించడంలో భాగంగా లబ్ధిదారులు అందరికీ ఒకేసారి కాకుండా సోషల్‌ డిస్టెన్స్‌ మెయింటైన్‌ చేస్తూ, జాగ్రత్తలు తీసుకుని వారికి స్థలాలను చూపించాలని ఆదేశించారు.  

పేదలకు మేలు చేస్తుంటే రాజకీయమా!
- సుమారు 27 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తూ.. వారి కుటుంబాల్లో మార్పులు తీసుకు వస్తుంటే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి వారు మనుషులే కాదనిపిస్తోంది.
- పేదలకు మంచి జరగకూడదనే ఒకే ఒక్క ఉద్దేశంతో కేసులు వేసి అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించాలి. 
- పేదలకు ఇస్తున్న ప్లాట్లు, వాటిని అభివృద్ధి చేసిన తీరును సవివరంగా తెలియజెప్పాలి. 
- ప్లాట్లను ముందుగానే అలాట్‌ చేస్తూ లాటరీ ప్రక్రియ పూర్తి చేయాలి.
- వారి వారి ప్లాట్ల వద్ద లబ్ధిదారులను నిలుచోబెట్టి ఫొటో తీయాలి. జియో ట్యాగింగ్‌ చేయాలి.
- నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ప్రతి నిరుపేదకు ఇంటి స్థలం కేటాయించాలి.
- గత సమీక్షతో పోలిస్తే.. ఇళ్ల పట్టాల విషయంలో ఈసారి మంచి ప్రగతి కనిపిస్తోంది. 

మరిన్ని వార్తలు