బాబూ..కరువు మండలాలు ఏవీ?

20 Dec, 2017 07:41 IST|Sakshi

మారాల రైతు సదస్సులో ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన విపక్ష నేత వైఎస్‌ జగన్‌

జూన్‌ నుంచి ఆగస్టు 9 వరకూ 32శాతం తక్కువ వర్షపాతం

ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుందనే కరువు మండలాల  ప్రకటనపై నిర్లిప్తత

పుట్టపర్తి నియోజకవర్గంలో చేరిన పాదయాత్ర...  ఘన స్వాగతం పలికిన శ్రీధర్‌రెడ్డి

నియోజకవర్గంలో అడుగడుగునా నీరాజనం

సాక్షిప్రతినిధి, అనంతపురం: ‘ఈ ఏడాది ఖరీఫ్‌లో జూన్‌ నుంచి ఆగస్టు 9 వరకు 32శాతం లోటు వర్షపాతం నమోదైంది. అయినా మంత్రివర్గ సమావేశం నిర్వహించి కరువు మండలాలపై ఎందుకు ప్రకటన చేయలేదు’ అంటూ సీఎం చంద్రబాబును విపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ప్రజాసంకల్ప యాత్ర 14వరోజు(మొత్తంగా 39వరోజు)లో భాగంగా మంగళవారం మారాలలో వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం నేతలు నిర్వహించిన ‘రైతు సదస్సు’లో ఆయన మాట్లాడారు. ‘అనంతపురానికి నీళ్లిచ్చామంటూ చంద్రబాబు గొప్పలు చెబుతున్నారు. నీళ్లు ఇచ్చి ఉంటే నాలుగేళ్లుగా ఏటా 63 మండలాలను కరువు ప్రాంతాలుగా ఎలా ప్రకటిస్తున్నారు? అనంతపురం జిల్లాలో హంద్రీ–నీవా ప్రాజెక్టుకు చంద్రబాబు సీఎం కాకముందు రూ. 6వేల కోట్లు ఖర్చు చేసి 80శాతం పనులు పూర్తి చేశారు. అధికారలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కనీసం పిల్ల కాలువలు పూర్తి చేసి ఉంటే ఫేజ్‌–1లో 1.20లక్షల ఎకరాలకు నీరందేది. కాలువలు తవ్వకపోవడంతో నాలుగేళ్లుగా రైతులు కరువుతో అల్లాడుతున్నారు. పక్కనే పీఏబీఆర్‌ ప్రాజెక్ట్‌ కన్పిస్తోంది. ఇక్కడ కూడా పిల్లకాలువలు తవ్వాలనే ఆలోచన చంద్రబాబుకు రావడం లేదు. రైతులు దారుణంగా బతుకుతున్నా, రాయలసీమ జిల్లాలు నీరు లేక అల్లాడుతున్నా చంద్రబాబుకు మనసు రాలేదు. నాలుగేళ్లలో జరుగుతున్న తీరిది. రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితుల్లో గతంలో ‘అనంత’లో భరోసాయాత్ర చేశా! రాష్ట్రవ్యాప్తంగా రైతుల పరిస్థితి ఇదే తీరుగా ఉండటంతో 3వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నా’ అని అన్నారు.

పుట్టపర్తిలో జననీరాజం
పాదయాత్ర ఉదయం తనకంటివారిపల్లి నుంచి మొదలై కృష్ణాపురం చేరుకోగానే గ్రామశివారులో పుట్టపర్తి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు.  మహిళలు దిష్టితీసి హారతి పట్టి పాదయాత్ర విజయవంతం కావాలని తిలకం దిద్దారు. దారిపొడవునా పూలు పరిచారు. వృద్ధులను ఆప్యాయంగా హత్తుకుంటూ.. పలకరిస్తూ జగన్‌ ముందుకు కదిలారు. వైఎస్సార్‌సీపీ జెండా ఆవిష్కరించారు. అక్కడి నుంచి రామసాగరం క్రాస్‌ చేరుకోగానే మాజీ ఎమ్మెల్సీ రహమాన్‌తో పాటు ముస్లింలు జగన్‌ను కలిసి యాత్రకు సంఘీభావం తెలిపారు.  మీసాల రంగన్న ఆధ్వర్యంలో రజకులు జగన్‌ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. యాదాలంకపల్లి క్రాస్‌ మీదుగా మారాల చేరుకుని రైతుసదస్సు నిర్వహించారు. అక్కడి నుంచి డీడీ కొట్టాల,  గంగులమడక క్రాస్‌ మీదుగా గరుగుతండా చేరుకున్నారు. ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలం కావడంతో మండల వాసులంతా భారీగా తరలివచ్చారు.  అగ్రహారం క్రాస్‌ చేరుకున్నారు. జగన్‌ను చూసేందుకు అగ్రహారం నుంచి భారీగా తరలివచ్చారు.  యువకులతో కరచాలనం చేసిన జగన్‌ అక్కడి నుండి నేరుగా పాముదుర్తి చేరుకున్నారు. పాముదుర్తిలో కూడా రోడ్లపై పూలు పరిచారు. మహిళలు దిష్టితీశారు. అక్కడి నుండి నేరుగా రాత్రిబస చేసిన ప్రాంతానికి చేరుకున్నారు. 14వరోజు యాత్రలో మొత్తం 16.3 కిలోమీటర్లు నడిచారు. యాత్రలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డితో పాటు సీనియర్‌ నాయకులు బొత్ససత్యనారాయణ, హిందూపురం, అనంతపురం పార్లమెంట్‌ అధ్యక్షులు శంకర్‌నారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, రాయలసీమ అధ్యక్షుడు తరిమెల నాగిరెడ్డి, మడకశిర సమన్వయకర్త తిప్పేస్వామి, యువజన, ట్రేడ్‌ యూనియన్, సేవాదళ్, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి,  ఆదినారాయణరెడ్డి, మిద్దె భాస్కర్‌రెడ్డి, రాజారాం, సీఈసీ సభ్యులు కడపల మోహన్‌రెడ్డి, కొత్తకోట సోమశేఖరరెడ్డి పాల్గొన్నారు.

బతుకులు సరిదిద్దండి
అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సత్యసాయి నీటి పథకంలో పనిచేసే తొమ్మిది వందలకు పైగా కార్మికుల కుటుంబాలు దుర్భర జీవనం సాగిస్తున్నాయని జగన్‌ ఎదుట కార్మికులు వాపోయారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే తమకు ఉద్యోగ భద్రతతో పాటు బోర్డు కార్మికులుగా గుర్తించి వేతనాలు పెంచేందుకు కృషి చేయాలని కోరారు. జగన్‌ను కలిసిన వారిలో కార్మిక సంఘం చైర్మన్‌ ఉపేంద్ర, జిల్లా కార్యదర్శి శంకర్, రామాంజినేయులు, కోశాధికారి రాము,  మహేష్, భాస్కర్‌ ఉన్నారు.

ఆరోగ్యశ్రీ వర్తించదంటున్నారు..
పుట్టుకతోనే తమ కూతురు అనుష్కకు చెవుడు, మూగ వచ్చిందనీ, ఆపరేషన్‌ చేయించడానికి తీసుకువెళితే ఆరోగ్యశ్రీ వర్తించదంటున్నారంటూ జగన్‌తో బుక్కపట్నం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన శంకర్, లక్ష్మీదేవి దంపతులు మొరపెట్టుకున్నారు. తమకు ముగ్గురు కుమారైలని, వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేదని వాపోయారు.

ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ రజకుల వినతి
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల జనాభా కలిగిన రజకులను ఎïస్సీ జాబితాలో చేర్చే అంశాన్ని పరిశీలించాలని జగన్‌ను రజక ఐక్య వేదిక నాయకులు కోరారు. మంగళవారం బుక్కపట్నం మండలం మారాల గ్రామం వద్ద రజక ఐక్య వేదిక నాయకులు ఎస్‌.రంగన్న, దేవేంద్రప్ప, బి.లింగమయ్య, సి.పెద్దన్న, పోలుగల్లు కమ్మన్న, సి.లింగమయ్య, మిట్టపల్లి రమణ తదితరులు జగన్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కేబినేట్‌ సమావేశంలో రజకులు, బోయలు, గంగపుత్రులు, వడ్డెర్లను ఎస్సీ  జాబితాలో చేర్చుతామని తీర్మానం చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విషయాన్ని పరిశీలించాలని కోరారు.

మరిన్ని వార్తలు