‘భూమాను మోసం చేసినవారితో పాల్గొనకూడదనే’

14 Mar, 2017 09:28 IST|Sakshi
‘భూమాను మోసం చేసినవారితో పాల్గొనకూడదనే’

విజయవాడ: ఎమ్మెల్యే భూమా నాగిరెడ‍్డి ఆకస్మిక మరణం బాధాకరమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. అయితే ఏపీ అసెంబ్లీలో భూమా నాగిరెడ్డి సంతాప తీర్మాన కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ సీపీ పాల్గొనట్లేదని పార్టీ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మంగళవారమిక్కడ తెలిపారు.  తమ పార్టీలో ఉన్నప్పుడు భూమా నాగిరెడ్డికి పీఏసీ చైర్మన్‌గా కేబినెట్‌ హోదా పదవి ఇచ్చి గౌరవంగా చూసుకున్నామన్నారు.

అయితే చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఆశ చూపి... ఇవ్వకపోవడం వల్లే మనస్థాపానికి గురై ఆ క్షోభతోనే ఆయన మరణించారన్నారు. భూమాను మోసం చేసిన వారితో కలిసి సంతాప కార్యక్రమ తీర్మానంలో పాల్గొనకూడదని తమ పార్టీ నిర్ణయించిందన్నారు. మానసిక క్షోభకు గురి చేయడం చంద్రబాబుకు అలవాటేనని, గతంలో ఎన్టీఆర్‌ను, ఇప్పుడు భూమా నాగిరెడ్డికి అలాగే చేశారన్నారు. టీడీపీలో చేరిన కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇలాగే ఉందని అన్నారు.