కాలుష్య నగరాల ప్రజలకు మరో  సెగ

13 Nov, 2019 10:50 IST|Sakshi

 ఆరోగ్య సమస్యలు పెరగడంతో ఆలోచనలోపడ్డ ఆరోగ్య బీమా కంపెనీలు

ఇన్సూరెన్స్‌  ప్రీమియం పెంచే యోచనలో కంపెనీలు

సాక్షి, న్యూఢిల్లీ: తీవ్రమైన కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న పలు నగరాల ప్రజలకు మరో షాక్‌ తగిలింది. కాలుష్య కాసారంలో మగ్గుతున్న   వివిధ నగరాలవాసులు ఆరోగ్య బీమా పొందాలంటే ఇక మీద ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సిందే. ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర శ్వాసకోశ వ్యాధులు తీవ్రం కానున్న నేపథ్యంలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కోసం 5 శాతం అదనంగా చెల్లించాలని బీమా కంపెనీలు చెప్పబోతున్నాయి.

ముఖ్యంగా ఢిల్లీ, ఎన్‌సిఆర్‌లోని క్లెయిమ్‌ల డేటా భారీ పెరగడంతో ఇన్సూరెన్స్‌ కంపెనీలో ఈ వైపుగా ఆలోచిస్తున్నాయి. అంతేకాదు కొత్తగా పాలసీ తీసుకునే వారిని  మరిన్ని  ఆరోగ్య పరీక్షలను కూడా అడగవచ్చని భావిస్తున్నారు.  జోన్ ఆధారిత ధరలను నిర్ణయించడం  బావుంటుందని మాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్  సీఎండీ ఆశిష్ మెహ్రోత్రా అభిప్రాయపడగా, నివాస ప్రాంతాల ఆధారంగా పాలసీని లోడ్ చేయడం సంక్లిష్టంగా ఉంటుందని మరో ఆరోగ్య బీమా సంస్థ అధికారి ఒకరు  పేర్కొన్నారు.  దీంతోపాటు ఢిల్లీ, దాని చుట్లుపక్కల ప్రాంతాల ఆరోగ్య బీమా పాలసీల్లో అధిక స్థాయిలో మోసపూరిత క్లెయిమ్‌లు ఎక్కువగా ఉండటంతో,  ధరలను నిర్ణయించడంలో ఇది కూడా కీలకమని  బీమా అధికారులు తెలిపారు. 

కాగా దేశ రాజధాని నగరంలో ఢిల్లీలో మరోసారి కాలుష్య పొట దట్టంగా ఆవిరించింది. బుధవారం దట్టమైన కాలుష్య పొర నగరాన్ని కమ్మేసింది. కాలుష్య స్థాయిలు ప్రమాద స్థాయికి చేరడంతో నగర మున్సిపాలిటీ విభాగం (ఎన్‌ఎండీసీ) చెట్లపై నీళ్లను చల్లడం లాంటి ఉపశమన చర్యలను చేపట్టింది.

మరిన్ని వార్తలు