మధుమేహంపై ఏటా రూ.1.5 లక్షల కోట్లు

25 Jan, 2017 01:15 IST|Sakshi
మధుమేహంపై ఏటా రూ.1.5 లక్షల కోట్లు

అపోలో షుగర్‌ సీఈఓ గగన్‌ భల్లా
మూడేళ్లలో 250 అపోలో షుగర్‌ క్లినిక్స్‌ ఏర్పాటు


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో ఇపుడు ఆరున్నర  కోట్ల మందికి మధుమేహం ఉంది. వీరు ఏటా చికిత్స కోసం రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇది కేంద్రం వైద్య రంగానికి కేటాయించే బడ్జెట్‌ కంటే 4.7 రెట్లు ఎక్కువ. ఇదీ... అపోలో షుగర్‌ క్లినిక్స్‌ సీఈఓ గగన్‌ భల్లా మాట. వేళకు తినకపోవటం, రాత్రి విధులు, ఒత్తిడి వంటివి దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. మధుమేహ పరీక్షలకు ప్రభుత్వం తలపెట్టనున్న కార్యక్రమంలో పీపీపీ విధానంలో తామూ భాగస్వామ్యమవుతామని మంగళవారమిక్కడ విలేకరులతో చెప్పారాయన. దేశంలోని మొత్తం డయాబెటిక్‌ పేషెంట్లలో 28 శాతం మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే ఉన్నారని, ఇందులో 18 శాతం యువతే ఉన్నారని భల్లా చెప్పారు. పేర్కొన్నారు.

3 ఏళ్లలో 300 క్లినిక్స్‌ లక్ష్యం..
ప్రస్తుతం దేశంలో 50 అపోలో షుగర్‌ క్లినిక్స్‌ ఉన్నాయి. ఇందులో తెలంగాణలో 11, ఏపీలో 2 క్లినిక్స్‌ మిగిలినవి ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉన్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో వరంగల్‌లో తొలి అపోలో క్లినిక్‌ను ప్రారంభిస్తున్నట్లు గగన్‌ తెలియజేశారు. వచ్చే మూడేళ్లలో తెలంగాణ, ఏపీల్లో అపోలో షుగర్‌ క్లినిక్స్‌ సంఖ్యను 50కి.. మొత్తంగా 300 క్లినిక్స్‌కు చేర్చాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు. వీటిలో సొంత క్లినిక్స్‌తో పాటూ పార్టనర్‌ క్లినిక్స్‌ కూడా ఉంటాయన్నారు.

మరిన్ని వార్తలు