విజయ్‌ మాల్యా జల్సాలకు చెక్‌

4 Apr, 2019 08:26 IST|Sakshi

లండన్‌ : బ్యాంకులకు రూ వేల కోట్లు రుణాల ఎగవేత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ బ్రిటన్‌లో తలదాచుకున్న లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా ఇప్పటికీ లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడని బ్రిటన్‌ కోర్టుకు ఎస్‌బీఐ నివేదించింది. మాల్యాకు చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌ యూకే పీఎల్సీ ఖాతా నుంచి 2,58,000 పౌండ్లను సీజ్‌ చేసే ప్రక్రియలో లండన్‌ కోర్టును ఎస్‌బీఐ అనుమతి కోరింది.

మరోవైపు తమ క్లైంట్‌ ప్రస్తుతం వారానికి 18,300 పౌండ్లు ఖర్చు చేస్తుండగా, ఖర్చును నెలకు 29,500 పౌండ్లకు తగ్గించేందుకు అంగీకరించారని మాల్యా న్యాయవాది ఎస్‌బీఐకి తెలపడంతో ఎస్‌బీఐ ఈ అంశాన్ని బ్రిటన్‌ కోర్టుకు తెలిపింది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ రుణాలను చెల్లించేందుకు మాల్యా ఉద్దేశపూర్వకంగానే నిరాకరిస్తున్నాడని బ్యాంకులు ఆరోపిస్తున్నాయి.

కాగా లగ్జరీ లైఫ్‌ను అనుభవించే విజయ్‌ మాల్యా ఇప్పటికీ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని ఎస్‌బీఐ న్యాయవాదులు కోర్టుకు సమర్పించిన అప్లికేషన్‌లో పేర్కొన్నారు. మాల్యాను చూస్తుంటే ఆయన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదని తెలుస్తోందన్నారు. మాల్యాకు కింగ్‌ఫిషర్‌ బీర్‌ యూరప్‌ లిమిటెడ్‌ నుంచి ప్రతినెలా 7500 పౌండ్ల ఆదాయం సహా ట్రస్టుల ద్వారా నడుస్తున్న కుటుంబ ఆస్తుల నుంచి కూడా ఆయనకు భారీగా ఆదాయం సమకూరుతోందని దరఖాస్తులో ఎస్‌బీఐ న్యాయవాదులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు