ఫలితమిచ్చిన పసిడి దిగుమతుల కట్టడి

6 May, 2014 00:54 IST|Sakshi
ఫలితమిచ్చిన పసిడి దిగుమతుల కట్టడి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పసిడి, వెండి దిగుమతుల కట్టడికి చర్యలు ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు దోహదపడ్డాయని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ సీ రంగరాజన్ సోమవారం ఇక్కడ పేర్కొన్నారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే దాదాపు 2 శాతంగా క్యాడ్ (ఒక ఆర్థిక సంవత్సరంలో క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్- ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీ మినహా దేశంలోకి వచ్చీ,పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం విలువ మధ్య ఉన్న వ్యత్యాసం) కట్టడి జరిగే పరిస్థితి నెలకొన్నట్లు ఆయన అన్నారు.  సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రంగరాజన్ ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. 2012-13లో 88 బిలియన్ డాలర్లుగా ఉన్న కరెంట్ అకౌంట్‌లోటు, 2013-14లో 32 బిలియన్ డాలర్లకు (జీడీపీలో దాదాపు 2 శాతం) తగ్గిపోవడం ఆర్థికరంగానికి కలసివస్తున్న అంశమని సూచించారు.

 ఎల్ నినోపై ఇప్పుడే చెప్పలేం..: కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీపై ఎల్ నినో ప్రభావం పడే అవకాశం ఉందన్న వార్తలపై అడిగిన ఒక ప్రశ్నకు రంగరాజన్ సమాధానం ఇస్తూ, ప్రభావం ఎలా ఉండబోతోందన్న అంశాన్ని కచ్చితంగా ఇప్పుడే చెప్పలేమన్నారు.
 విద్యార్థులకు ప్రేమతో బోధించాలి: విద్యార్థులకు ప్రేమతో, చక్కగా అర్ధమయ్యేలా బోధించినప్పుడే అధ్యాపకుడు తన వృత్తికి న్యాయం చేసినట్లు అవుతుందని సెస్‌ప్రాంగణంలో 2014-15 బ్యాచ్ ఎంఫిల్. పీహెచ్‌డీ బ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రంగరాజన్ అన్నారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇప్పటివరకు 100 మంది ఎంఫిల్, 70 మంది విద్యార్థులు పీహెచ్‌డీ పూర్తి చేసినట్లు సంస్థ  డెరైక్టర్ ఎస్.గలాబ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు