రాజీలేని నాణ్యత వల్లే ఈ స్థాయి

28 Sep, 2019 05:02 IST|Sakshi
జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో బీసీసీపీఎల్‌ ౖచైర్‌ పర్సన్‌ భారతి రెడ్డి తదితరులు

 పదేళ్లలోనే భారతి సిమెంట్‌కు అగ్రస్థాయి

సంస్థ ౖచైర్‌ పర్సన్‌ వైఎస్‌ భారతి రెడ్డి వ్యాఖ్యలు

నల్లలింగాయపల్లె (కమలాపురం): వినియోగదారుల ఆశీర్వాదాలే వ్యాపారానికి పునాదులని భారతి సిమెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీసీసీపీఎల్‌) ఛైర్‌ పర్సన్‌ వైఎస్‌ భారతి రెడ్డి చెప్పారు. వైఎస్సార్‌ జిల్లా కమలాపురం మండలం నల్ల లింగాయపల్లెలో బీసీసీపీఎల్‌ 10వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బీసీసీపీఎల్‌ భాగస్వామ్య సంస్థ వికా (ఫ్రాన్స్‌) అధిపతి గై సిడోస్, సోఫి సిడోస్‌ దంపతులతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ తన మామయ్య స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జిల్లా ప్రజలకు ఉపాధి చూపడంతో పాటు నిర్మాణ రంగంలో నాణ్యమైన సిమెంట్‌ అందించాలని సూచించారని, దీంతో వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి అప్పట్లో భారతి సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని చెప్పారు.

రోజు రోజుకూ పెరుగుతున్న టెక్నాలజీని వినియోగిస్తూ నాణ్యతకు అగ్రాసనం వేస్తున్నామని చెప్పారు. రోబోటిక్‌ క్వాలిటీ, జర్మన్‌ టెక్నాలజీ, టెంపరింగ్‌ ప్యాకింగ్‌తో అందిస్తున్న నాణ్యమైన సిమెంట్‌ను వినియోగిస్తున్న వారి ఆశీర్వాదాలే కంపెనీకి పునాదులన్నారు. దక్షిణ భారత దేశంతో పాటు పలు ప్రాంతాల్లో భారతి సిమెంట్‌ వినియోగం బాగుందని, దేశంలో రెండో స్థానంలో ఉన్నామని చెప్పారు. ఈ సందర్భంగా పరిశ్రమ డైరెక్టర్లతో పాటు కార్మికులు, ఉద్యోగులు, మార్కెటింగ్‌ సిబ్బందిని ప్రశంసించారు. తమ కంపెనీలో 200 సంవత్సరాల అనుభవం ఉన్న ఫ్రాన్స్‌కు చెందిన వికా భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందన్నారు. వికా అధినేత గై సిడోస్‌ మాట్లాడుతూ 1817 నుం చి తమ వంశం సిమెంట్‌ పరిశ్రమలు నిర్వహిస్తోందని, 10 ఏళ్లలో కంపెనీ ఉన్నత స్థాయికి ఎదగడం గర్వించదగ్గ విషయమని చెప్పారు. ఫ్యాక్టరీ సీఈఓ అనూప్‌ కుమార్‌ సక్సేనా, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సాయిరమేష్‌ , పరిశ్రమ ప్రతినిధులు హరీష్‌ కామర్తి, బాలాజీ, జేజే రెడ్డి, రవిందర్‌ రెడ్డి, పిట్రాకోలా తదితరులు మాట్లాడారు.

మరిన్ని వార్తలు