ఎన్‌సోనో చేతికి విప్రో ‘డేటా సెంటర్‌’

15 Mar, 2018 00:32 IST|Sakshi

డీల్‌ విలువ 405 మిలియన్‌ డాలర్లు 

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో తాజాగా తమ హోస్టెడ్‌ డేటా సెంటర్‌ సర్వీసెస్‌ వ్యాపారాన్ని ఎన్‌సోనో సంస్థకు విక్రయిస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఎన్‌సోనోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. ఈ డీల్‌ విలువ 405 మిలియన్‌ డాలర్లు. ఈ ఒప్పందం ప్రకారం విప్రోకి చెందిన ఎనిమిది డేటా సెంటర్స్, వాటిల్లో పనిచేసే 900 మంది ఉద్యోగులు ఎన్‌సోనోకు బదిలీ అవుతారు. అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు ఎన్‌సోనో సంస్థకి ఈ డీల్‌ ఉపయోగపడుతుందని విప్రో సీనియర్‌ వీపీ కిరణ్‌ దేశాయ్‌ పేర్కొన్నారు.

2007లో ఇన్ఫోక్రాసింగ్‌ సంస్థను కొనుగోలు చేయడం ద్వారా మరో రెండు విభాగాలతో పాటు హోస్టెడ్‌ డేటా సెంటర్‌ సర్వీస్‌ వ్యాపారం కూడా విప్రో చేతికి వచ్చింది. తాజాగా దీన్నే విక్రయిస్తోంది. ఇక, మూడేళ్ల వ్యవధిలో ఇది తాము కొనుగోలు చేస్తున్న మూడో సంస్థ కానుందని ఎన్‌సోనో సీఈవో జెఫ్‌ వాన్‌డైలెన్‌ తెలిపారు. మరోవైపు విప్రో కొత్త, పాత ఎంటర్‌ప్రైజ్‌ కస్టమర్స్‌కి సంయుక్తంగా హైబ్రీడ్‌ ఐటీ సర్వీసులు అందించే దిశగా విప్రో, ఎన్‌సోనో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. 

మరిన్ని వార్తలు