హైదరాబాద్‌, బెంగళూరులో ఆస్తులు అమ్మేయనున్న విప్రో..?

24 Nov, 2023 12:08 IST|Sakshi

టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న విప్రో.. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. సాధారణంగా కాస్ట్‌కటింగ్‌ పేరిట టెక్‌ సంస్థలు ఉద్యోగాల్లో కోత విధిస్తూ ఖర్చు తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే. దాంతోపాటు విప్రో ఆస్తులను సైతం విక్రయించాలని యోచిస్తోంది.

కొన్ని మీడియా కథనాల ప్రకారం.. హైదరాబాద్‌, బెంగళూరులోని తన ఆస్తులను విక్రయించాలని విప్రో నిర్ణయించింది. ఈ క్రమంలో కంపెనీ కలిగి ఉన్న నాన్ కోర్ రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. కంపెనీ విక్రయించాలనుకుంటున్న ప్రాపర్టీల్లో హైదరాబాద్ గచ్చిబౌలిలోని క్యాంపస్, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని క్యాంపస్‌లు ఉన్నట్లు వెల్లడైంది.

గచ్చిబౌలి విప్రో క్యాంపస్‌ దాదాపు 14 ఎకరాలమేర విస్తరించి ఉంది. ఇక బెంగళూరులో 25 ఎకరాల భూమిని కలిగి ఉంది. అయితే కంపెనీ ఆ భూమిని పూర్తిగా లేదా కొంతమేరకే విక్రయిస్తుందా తెలియాల్సి ఉంది. బెంగళూరు క్యాంపస్‌ను దశల వారీగా అమ్మనున్నట్లు సమాచారం. మొదటి దశలో ఐదు ఎకరాలు విక్రయిస్తుందని తెలిసింది.  టెక్‌ కంపెనీలు మారుతున్న వర్క్‌కల్చర్‌కు అనుగుణంగా హైబ్రిడ్‌వర్క్‌ మోడల్‌ను అనుసరిస్తున్నాయి. వివిధ నగరాల్లోని కార్యకలాపాలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే విప్రో ఈ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. అయితే కంపెనీ మాత్రం ఈ వార్తలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

ఇదీ చదవండి: సినిమా కోసం రూ.91 కోట్లు ఇస్తే రూ.50 కోట్లు పోగొట్టిన దర్శకుడు

హైదరాబాదులో విప్రోకు మొత్తం మూడు ప్రాపర్టీలు ఉన్నాయి. వీటిలో రెండు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉండగా.. ఒకటి మణికొండలో ఉంది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 20 ఏళ్ల క్రితం కంపెనీకి భూమి కేటాయించింది. సెప్టెంబర్‌ త్రైమాసికం వరకు విప్రోలో 2,44,707 మంది ఉద్యోగులు ఉన్నారు.

మరిన్ని వార్తలు