చిన్న రన్‌వేలపై రిస్క్ తీసుకోవద్దు

14 Jun, 2014 01:34 IST|Sakshi
చిన్న రన్‌వేలపై రిస్క్ తీసుకోవద్దు

న్యూఢిల్లీ: చిన్న రన్‌వేలు కలిగిన జమ్మూ, పాట్నాలకు పూర్తి లోడ్‌తో విమానాలు నడుపుతున్న ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్‌లపై ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తీరు మార్చుకోకపోతే వాటి కార్యకలాపాలను నిలిపేస్తామని హెచ్చరించింది. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ మేరకు శుక్రవారం ఆయా కంపెనీలకు నోటీసులు జారీచేసింది.
 
దీనిపై శనివారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. చిన్న రన్‌వేలు కలిగిన ఎయిర్‌పోర్టులకు 20 శాతం తక్కువ లోడ్‌తో విమానాలు నడపాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారం ఆ రెండు ఎయిర్‌పోర్టుల్లో ల్యాండ్ అయ్యే విమానాల్లో ప్రయాణీకుల సంఖ్య 150-155 వరకు ఉండాలి.

కానీ, ఈ కంపెనీలు ఒక్కో విమానంలో 170-180 మంది పాసెంజర్లను తరలిస్తున్నాయి. ఈ వ్యవహారంపై స్పందించడానికి మూడు కంపెనీల ప్రతినిధులు నిరాకరించారు. లోడ్ పరిమితి నిబంధనలను ఈ కంపెనీలు ప్రతిరోజూ ఉల్లంఘిస్తున్నాయనీ, తద్వారా ప్రయాణీకుల భద్రతకు నీళ్లొదులుతున్నారనీ అధికార వర్గాలు వ్యాఖ్యానించాయి.

మరిన్ని వార్తలు