‘రైళ్లను పేల్చేస్తా’నంటూ బెదిరించి.. పోలీసు విచారణలో నిందితుని ట్విస్ట్‌!

6 Nov, 2023 10:52 IST|Sakshi

పట్నా: బీహార్ రాజధాని పట్నా రైల్వే స్టేషన్‌లో ఆ సమయంలో కలకలం చెలరేగింది. రాజధాని, జన-శతాబ్ది, వందే భారత్ రైళ్లను పేల్చివేస్తామంటూ రైల్వే అధికారులకు బెదిరింపు లేఖ వచ్చింది. రాజేంద్ర నగర్ టెర్మినల్ స్టేషన్ మేనేజర్‌కు ఆగంతకుడు ఈ బెదిరింపు లేఖను పోస్ట్ ద్వారా పంపాడు. 

తాను ఈ మూడు రైళ్లను పేల్చకుండా ఉండాలంటే రైల్వే శాఖ తనకు రూ.1.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో ఈ విషయాన్ని స్టేషన్‌ మేనేజర్‌.. జీఆర్పీకి, స్థానిక పోలీసులకు తెలియజేశారు. ఈ కేసులో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి మరొకరిని ఈ కేసులో ఇరికించాలని ఒక పథకం ప్రకారం స్టేషన్ మేనేజర్‌కు బెదిరింపు లేఖ పంపాడు.

ఈ కేసులో కామత్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు కామత్‌ విస్తుపోయే వివరాలను వెల్లడించాడు. కపిల్ దేవ్ అనే వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని, పోలీసు కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో కామత్‌ ఈ బెదిరింపు లేఖ రాశాడని పోలీసుల విచారణలో తేలింది. కామత్‌, కపిల్ దేవ్ మధ్య చాలా కాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ  నేపధ్యంలో కామత్‌ జైలుకు కూడా వెళ్లాడు. జైలు నుంచి విడుదలైన అతను కపిల్‌దేవ్‌పై పగ తీర్చుకునే ఉద్దేశంతో ఈ పనిచేశాడని పోలీసులు తెలిపారు. 
ఇది కూడా చదవండి: పాక్‌పై ప్రాణాంతక అమీబా దాడి.. 11 మంది మృతి!

మరిన్ని వార్తలు