ఎగుమతులు యూ టర్న్

16 Jul, 2016 00:53 IST|Sakshi
ఎగుమతులు యూ టర్న్

18 నెలల వరుస పతనం తర్వాత పెరుగుదల
జూన్ నెలలో 1.27 శాతం వృద్ధి
దిగివచ్చిన వాణిజ్య లోటు

 న్యూఢిల్లీ: ఏడాదిన్నర వరుస పతనం తర్వాత ఎగుమతులు పుంజుకున్నాయి. జూన్ నెలలో దేశీయ ఎగుమతుల్లో 1.27 శాతం వృద్ధి చోటు చేసుకుంది. వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తుల్లో ఎగుమతులు కలసివచ్చాయి. దీనికితోడు దిగుమతులు తగ్గుముఖం పట్టడంతో వాణిజ్య లోటు సైతం దిగివచ్చింది.

జూన్ నెలలో ఎగుమతులు 22.57 బిలియన్ డాలర్లు (రూ.1.51 లక్షల కోట్లు సుమారు)గా నమోదయ్యాయి. ఇది 1.27 శాతం పెరుగుదల. 2015 జూన్ నెలలో ఎగుమతులు 22.28 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి.

దిగుమతుల్లో 7.33 శాతం క్షీణత చోటు చేసుకుంది. 2015 జూన్ నెలలో 33.11 బిలియన్ డాలర్లుగా ఉండగా... ఈ ఏడాది జూన్ లో 30.68 బిలియన్ డాలర్లకు తగ్గాయి.

ఫలితంగా జూన్ నెలలో వాణిజ్య లోటు 8.11 బిలియన్ డాలర్లకు దిగి వచ్చింది. ఈ లోటు అంతకుముందు ఏడాది ఇదే నెలలో 10.82 బిలియన్ డాలర్లుగా ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ తగ్గడం, చమురు ధరల పతనంతో 2014 డిసెంబర్ నుంచి ఎగుమతులు తగ్గుతూ వచ్చాయి.  

పెట్రోలియం, క్రూడ్ ఉత్పత్తుల దిగుమతులు 16.42 శాతం తగ్గాయి. 

బంగారం దిగుమతులు భారీగా క్షీణించాయి. జూన్‌లో 1.20 బిలియన్ డాలర్ల మేర బంగారం దేశంలోకి దిగుమతి అయింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 38.54 శాతం తగ్గినట్టు.

 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో తక్కువగానే...
అయితే, ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో చూస్తే మొత్తం మీద ఎగుమతుల విలువ 65.31బిలియన్ డాలర్లుగా ఉంది. 2015 జూన్ క్వార్టర్‌లో ఎగుమతులు 66.69 బిలియన్ డాలర్లు.

మరిన్ని వార్తలు