గెలాక్సీ మోడళ్లపై సామ్సంగ్ ఆఫర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ చేజారితే స్క్రీన్ పగిలిపోతుందన్న బెంగ వినియోగదార్లలో సహజం. ఫోన్కు చేసిన వ్యయంలో 60 శాతంపైగా కొత్త స్క్రీన్ కోసం ఖర్చు చేయాల్సి రావడమే ఇందుకు కారణం. కస్టమర్లు ఇక ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటోంది సామ్సంగ్. నెవర్ మైండ్ పేరుతో స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ను కంపెనీ ప్రకటించింది.
సెప్టెంబరు 21 నుంచి అక్టోబరు 21 మధ్య గెలాక్సీ సిరీస్లో స్మార్ట్ఫోన్, ట్యాబ్లెట్ పీసీ కొన్న కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. కొనుగోలు చేసిన 12 నెలల్లో స్క్రీన్ పగిలితే కొత్తది మారుస్తామని సామ్సంగ్ మొబైల్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆసిమ్ వార్సి బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఇందుకు కస్టమర్లు రిపేర్ సమయంలో రూ.990 చెల్లిస్తే చాలని చెప్పారు.