సాక్షి, న్యూఢిల్లీ : బులియన్ మార్కెట్లో బంగారం ధరలు అత్యంత గరిష్టానికి చేరాయి గత కొన్ని రోజులుగా అప్ట్రెండ్లో ఉన్న పసిడి ధర అంతర్జాతీయ కారణాలతో నింగివైపు చూస్తోంది. వరుసగా నాలుగో రోజు కూడా పాజిటివ్ ధోరణిని కనబర్చింది. బుధవారం మరింత ఎగిసి 10 గ్రా. పుత్తడి ధర 34వేల రూపాయల మార్క్ను టచ్ చేసింది. దీంతో ఎనిమిది నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. గత రెండు రోజుల్లో గోల్డ్ ధరలు రూ. 450 పెరిగాయి. వెండి కూడా ఇదే బాటలో ఉంది. కిలో ధర 330 రూపాయలు ఎగిసి రూ.41,330లు పలుకుతోంది.
ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ. 34,070గా ఉంది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం రూ. 33,920లు పలుకుతోంది. అదేవిధంగా సావరిన్ 8 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 25,900గా ఉంది.
ఫెడ్ వడ్డీరేటు, అమెరికా - చైనా ట్రేడ్ వార్ ఆందోళనలు, చైనా టెక్ దిగ్గజం హువావేపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించడంతో అనిశ్చితి ఏర్పడింది. దీంతో పెట్టుబడిదారులు బంగారం కొనుగోళ్లవైపు మొగ్గు చూపారని బులియన్ వర్గాలు తెలిపింది. అటు అంతర్జాతీయంగా కూడా పుత్తడి ధర పాజిటివ్గా ఉంది. స్పాట్ బంగారం 0.1 శాతం పెరిగి 1,315.93 డాలర్లు టచ్ చేసింది.