ప్రజా రవాణాకు జీపీఎస్‌ తప్పనిసరి!

1 Jan, 2019 23:56 IST|Sakshi

కొత్త వాహన నిబంధనలు అమల్లోకి

పానిక్‌ బటన్‌ సైతం ఉండాల్సిందే

ట్రాకింగ్, ప్రయాణికుల భద్రత కోసమే!  

పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాల్లో గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌), పానిక్‌ బటన్‌ ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి త్వ శాఖ ఈ మేరకు దేశవ్యాప్తంగా పలు నిబంధనలను మంగళవారం నుంచి అమల్లోకి తెచ్చింది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనల ప్రకారం... ఆటో రిక్షాలు, ఈ– రిక్షాలు మినహా సెం ట్రల్‌ మోటార్‌ వెహికిల్స్‌ రూల్స్‌– 1989 కిందకు వచ్చే అన్ని బస్సు లు, స్కూల్‌ బస్సులు, టాక్సీ వంటి పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలకు వెహికిల్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌ (వీఎల్‌టీ) పరికరాలు తప్పనిసరిగా ఉం డాలి. నేషనల్‌ పర్మిట్‌ ఉన్న కమర్షియల్‌ వాహనాలను సైతం ఈ నిబంధన కిందకు చేర్చా రు. జీపీఎస్‌ ట్రాకింగ్‌ సిస్టమ్, పానిక్‌ బటన్‌ ఉంటేనే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఇవి ఉంటేనే పాత వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. 

దేశవ్యాప్తంగా 2.5 కోట్ల వాహనాలు.. 
భారత్‌లో ప్రస్తుతం 1.8 కోట్ల పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలు ఉన్నట్టు సమాచారం. అలాగే నేషనల్‌ పర్మిట్‌ ఉన్న ట్రక్స్‌ 75 లక్షలు ఉన్నాయని జీపీఎస్‌ ట్రాకింగ్‌ పరికరాలు తయారు చేసే వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్‌ వ్యవస్థాపకుడు కోణార్క్‌ ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. ఇప్పటి వరకు ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలు తమ వాహనాల్లో జీపీఎస్‌ ట్రాకింగ్‌ పరికరాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సంస్థలే వాహన రాకపోకలను ట్రాక్‌ చేస్తున్నాయి. తాజా విధానంలో ప్రభుత్వమే రంగంలోకి దిగుతుంది. పన్ను ఎగ్గొట్టే వాహనాలను గుర్తించవచ్చు కూడా. మహిళలు, విద్యార్థులు, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కొత్త నిబంధనను తెచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. వాహనం ప్రమాదానికి గురైతే ఎక్కడ జరిగిందో సులువుగా గుర్తించవచ్చు కూడా. 

ఏఐఎస్‌ ధ్రువీకరణ ఉంటేనే.. 
టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏఐఎస్‌– 140 నేషనల్‌ వెహికిల్‌ ట్రాకింగ్‌ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ట్రాకింగ్‌ డివైస్‌ వివరాలు, చాసిస్‌ నంబరును వాహన పోర్టల్‌కు అనుసంధానిస్తారు. దీంతో వాహనాల కదలికలన్నీ డేటా సెంటర్లో నిక్షిప్తం అవుతాయి. అవసరమైతే ట్రాన్స్‌పోర్ట్, పోలీసు శాఖలకు మాత్రమే ఈ సమాచారం తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. వీటి పర్యవేక్షణకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇక నూతన నిబంధనల ప్రకారం ఏఐఎస్‌– 140 ధ్రువీకరణ ఉన్న జీపీఎస్‌ ట్రాకింగ్‌ పరికరాలను మాత్రమే ఇందుకు వినియోగించాలి. తెలుగు రాష్ట్రా ల నుంచి వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్‌ పరికరా లు ఈ సర్టిఫికేషన్‌ పొందినట్లు కోణార్క్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు